పశ్చిమ దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. అత్యధికంగా రాజమండ్రి నగరంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. రాజమండ్రితో పాటు గుంటూరు, విజయవాడ​, తుని, తాడేపల్లిగూడెం, బందరు, బాపట్ల​, కాకినాడల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 మధ్యలో నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా బేగంపేట్ లో 39.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు 40 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.


నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినా, ఏపీ, తెలంగాణలో రాక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే మనం వర్షాలను చూడొచ్చు. అంతేగానీ ఎక్కడా భారీ వర్షాలు, విస్తారమైన వర్షాలుండవు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతం ప్రభావంతో మేఘాలు ఏర్పడి ఏపీ మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల 44, 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, కృష్ణా, విజయవాడ​, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో నేడు సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ ఈరోజు ఎక్కడ వర్షాలుండవు. బాగా వేడిగా ఉండనుంది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రుతుపవనాలు కేరళ దక్షిణ భాగం దగ్గర చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీని వల్ల రుతుపవనాలు కాస్తంతా ఆలస్యం అవ్వనుంది. కానీ జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు.