Andhra Pradesh Rains Alert | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల కిందకు వెళ్లి నిలబడరాదని ఏపీ విపత్తులు నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మే 4, 5 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం నాడు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తిరుపతి మంగనెల్లూరులో శనివారం 42.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లకూడదని సూచించారు. నేడు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41-42.5°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. విశాఖ, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విజయవాడ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురు గాలులు, ఉరుములతో వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా మారడంతో సేదదీరుతున్నారు నగర ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.