తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఖండించారు. తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చిల్లర రాజకీయాల కోసమే నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు. ఖమ్మంలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తు్న్నారని విమర్శించారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని తనకు ఇవ్వమని అడిగారు.


ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోంది. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే సీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు అవుతున్న ప్రగతిని దేశానికి పరిచయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే తేదీని ఖరారు చేస్తాం’’ అని తోట చంద్రశేఖర్ మాట్లాడారు.


ఖమ్మం బీఆర్ఎస్ సభ తర్వాత ఏపీకి చెందిన పెద్ద నేతలు బీఆర్ఎస్‌లో చేరతారని తోట చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద నేతలు తమను కలుస్తున్నారని తెలిపారు. ఖమ్మం సభ తర్వాత భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు, రైతు రుణ మాఫీ వంటి పథకాలు దేశంలోనే ఓ మోడల్ గా ఉన్నాయని అన్నారు. 


ఇటీవలే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రేశఖర్ ను కేసీఆర్ నియమించారు. అంతకు ముందు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మహారాష్ట్ర క్యాడర్‌లో పని చేసేవారు. వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీనే మియాపూర్ భూముల్ని కొన్నారని.. రఘునందన్ ఆరోపిస్తున్నారు. 


రఘునందన్ ఆరోపణలు ఇవీ


భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా ఇటీవల ప్రకటించిన తోట చంద్రశేఖర్‌కుచెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ. 4 వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎస్  సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు.  ఖమ్మం సభకు ఆర్థికవనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని హైదరాబాద్‌లో నిర్వహించన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.  తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉందన్నారు. 


బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ... దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారన్నారు. మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై   సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్..  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.  వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని నిలదీశారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.