Vizag MP Family Kidnap :  విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎంపీ భార్య , కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవిని కిడ్నాప్ చేశారు. రుషికొండ సమీపంలో ఎంపీ ఇల్లు ఉంది. ఆయన వ్యాపార వ్యవహారాల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లొకి చొరబడిన దుండగులు..  ఎంపీ భార్య, కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారి ద్వారా ఆడిటర్ జీవీని కూడా పిలించి ..ఆయనను కూడా కిడ్నాప్ చేశారు. ఆడిటర్ జీవీ స్మార్ట్ సిటీ కార్పొరేష్ మాజీ డైరక్టర్ కూడా.  ఈ కిడ్నాప్ .. హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది రౌడీషీటర్ హేమంత్ అని చెబుతున్నారు. 


పూర్తి వివరాలను  సాయంత్రం వెల్లడిస్తామంటున్న పోలీసులు                   


ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఏ వివరాలను బయటకు వెల్లడించడం లేదు. అయితే  ఆడిటర్ జీవీ అలియాస్ గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య చాలా కాలంగా భూ వివాదాలు ఉన్నాయని భావిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. ఇటీవల వారి మధ్య విబేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో..  ఇలా ఆడిటర్ తో పాటు.. ఎంపీ భార్య, కుమారుడ్ని రౌడషీటర్ కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ వెనుక ఆడిటర్ జీవీ ఉన్నారా లేకపోతే ఆయన కూడా కిడ్నాపయ్యారా అన్నది పోలీసులు వెల్లడించడం లేదు. 


కిడ్నాపర్లను అరెస్ట్ చేసి ఎంపీ కుటుంబసభ్యుల్ని కాపాడామన్న పోలీసులు                      


పోలీసులు మాత్రం కిడ్నాప్ కథ సుఖాంతమయిందని..ఎంపీ భార్యతో పాటు కుమారుడ్ని కూడా విడిపించామని నిందితుల్ని అరెస్ట్ చేశామని.. మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. సాయంత్రంలోపు అన్ని  విషయాలను బయటపెడతామని చెప్పారు. అటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇటు ఆడిటర్ జీవీ ఇద్దరూ వైఎస్ఆర్‌సీపీ నాయకులే కావడంతో.. అసలు ఈ కిడ్నాప్  వ్యహహారం వివాదాస్పదం అయ్యే చాన్స్ ఉండటంతో.. పోలీసులు కూడా గుంభనంగా ఉన్నారు. ఎంపీ ఎంవీవీ వర్గీయులు మాత్రం ఈ ఘటన వెనుక రౌడీషీటర్ హేమంత్ ఉన్నారని చెబుతున్నారు. అసలు ఎంపీ కుటుంబసభ్యుల్నే కిడ్నాప్ చేసేంత ధైర్యం ఓ సాధారణ రౌడీషీటర్ ఎందుకు చేస్తారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింంది. 


విశాఖలో శాంతిభద్రతల పరిస్థితి మరోసారి చర్చనీయాంశం                                        


మరో వైపు ఎంపీ కుటుంబసభ్యులను ఇంట్లో నుంచే కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించిది. అదీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటూ ... వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటిస్తున్న పట్టణంలో ఓ ఎంపీ కుటుంబసభ్యుల్ని పట్టపగలు కిడ్నాప్ చేయడం చిన్న విషయం కాదని..  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.