Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయంతో ఇండియా చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలల్లో ఇండియా చరిత్ర సృష్టించిందని వేనోళ్లతో ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో ఎంతో మంది కృషి ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. దేశ ఘటతను ప్రపంచ వ్యాప్తం చేయడంలో తమ వంతు కృషి చేశారు.


రాడార్ కంట్రోలర్ విభాగం జనరల్ మేనేజర్‌గా దుగ్గిరాల వాసి
దుగ్గిరాలకు చెందిన మాజేటి మురళి చంద్రయాన్‌-3లో రాడార్‌ కంట్రోలర్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా సేవలు అందించారు. 1992లో శ్రీహరికోటలో మురళి శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. వివిధ విభాగాల్లో పనిచేశారు. చంద్రయాన్ 3తో కీలకంగా పని చేశారు. చిన్న కుటుంబంలో పుట్టిన మురళి ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగి జిల్లాకు ఎనలేని కీర్తి తీసుకొచ్చారు. తమ గ్రామానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


బాపట్ల జిల్లా నుంచి మానస
చంద్రయాన్ 3 ప్రయోగంలో బాపట్ల జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త బొల్లు మానస భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగేలా ఇస్రో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కీలక శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు. మానస కేరళలోని తిరువనంతపురం ఐఎస్‌టీ కళాశాలలో ఏవియానిక్స్‌ చదివారు. 2014లో  బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ విభాగంలోనూ ఈమె శాస్త్రవేత్తగా సేవలందించారు. చంద్రయాన్ ప్రయోగం విజయం చంద్రుడిపై మానవ సహిత యాత్రకు దోహదం చేస్తుందని మానస తెలిపారు. 


సత్యసాయి జిల్లా నుంచి ఉషశ్రీకాంత్
చంద్రయాన్‌ 3లో సత్యసాయి పూర్వ విద్యార్థిని ఉషశ్రీకాంత్‌ పాలు పంచుకున్నారు. శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్‌లో 1995-1998 బ్యాచ్‌కు చెందిన ఉషశ్రీకాంత్‌ ఫిజిక్స్‌ అభ్యసించింది. చంద్రయాన్‌ 3లో శాస్త్రవేత్తగా ఆమె పాల్గొన్నారు. సత్యసాయి స్వయంగా ఇచ్చిన చీరను ఆమె ధరించి ప్రయోగాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో అంగారకుడు, ఇతర గ్రహాలపైకి ఇస్రో పంపే మానవ రహిత ల్యాండర్లు, రోవర్లు అడుగు పెట్టడానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.


అనంతపురం నుంచి సాయి చందన, పూర్వ విద్యార్థి మురళి
అనంతపురం నగరానికి చెందిన సాయిచందన చంద్రయాన్ ప్రయోగంలో భాగస్వామి అయ్యారు. అనంతపురం జేఎన్‌టీయూలో 2000 సంవత్సరంలో బీటెక్‌ చదివిన సాయిచందన 2022 సంవత్సరంలో ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైంది. అలాగే అనంతపురం సిటీలోని పొట్టి శ్రీరాములు నగరపాలకోన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మురళి శాస్త్రవేత్తగా చంద్రయాన్‌-3లో పాల్గొన్నారు. 


విజయనగరం నుంచి దుర్గాప్రసాద్, సతీష్ 
విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు శాష్త్రవేత్తలు కరణం దుర్గా ప్రసాద్, బూరాడ సతీష్ చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలకంగా పనిచేశారు. విజయనగరానికి చెందిన కరణం దుర్గాప్రసాద్‌ చంద్రయాన్ 3 ప్రయోగంలో పని చేశారు. ఈయన అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్‌-2 మిషన్‌కు సైతం పని చేశారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్‌ పర్యవేక్షక బృందానికి నాయకత్వం వహించారు. అలాగే సంతకవిటి మండలం సిరిపురానికి చెందిన బూరాడ సతీష్‌ కూడా ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించారు.


చందన- వైఎస్సార్ జిల్లా 
చంద్రయాన్ ప్రయోగంలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన అవ్వారు చందన (26) భాగస్వామి అయ్యారు. 2019లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన ఐఐఎస్‌టీ పోటీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి ఎంపికయ్యారు. బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ కేంద్రంలో విక్రమ్‌ ల్యాండర్‌ డిజైనర్‌ విభాగంలో పనిచేస్తున్నారు. చంద్రయాన్‌ మిషన్‌లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.


హైదరాబాద్ ఉప్పల్ నుంచి భరత్
హైదరాబాద్ నగరం ఉప్పల్‌కు చెందిన దేవసాని భరత్‌ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఆరేళ్లుగా చేస్తున్నారు. చంద్రయాన్‌-3లో టెలీ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సిగ్నలింగ్‌ వ్యవస్థ బృందంలో భరత్‌ సభ్యుడిగా ఉన్నారు. ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్‌ దేవసాని బాలచందర్‌ కుమారుడు కావడం విశేషం. 


రమేష్ - మహబూబ్‌నగర్‌ జిల్లా
చంద్రయాన్‌ 3 శాస్త్రవేత్తల బృందంలో మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన శాస్త్రవేత్త రమేష్ పనిచేశారు. గిరిజన కుటుంబానికి చెందిన రమేష్‌ మూడేళ్ల నుంచి ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు.  చంద్రయాన్ 3 విజయంతం కావడంతో బెంగళూరులోని నియంత్రణ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో తన సహచరులతో కలిసి పాల్గొన్నారు. 


చాలా ఆనందంగా ఉంది (గంజి వెంకట నారాయణ - చుంచుపల్లి)
చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని పెనగడపకు చెందిన రిటైర్డ్ ఇస్రో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంజి వెంకట నారాయణ అన్నారు. టెస్టింగ్‌, మెటీరియల్‌ ఎంపిక, ఫ్యాబ్రికేషన్‌, అసెంబ్లింగ్‌లో పాలుపంచుకున్నట్లు చెప్పారు. త్రివేండ్రంలో ఇస్రో డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసి జులై 31న ఉద్యోగ విరమణ పొందారు. 


గర్వంగా ఉంది (శివరామకృష్ణ- అశ్వరావుపేట)
చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి ఇస్రో శాస్త్రవేత్త వడ్లపూడి శివరామకృష్ణ అన్నారు. శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో థర్మల్‌ ప్రొటెక్షన్‌ సెక్షన్‌లో నూతన మెటీరియల్స్‌ తయారీ విభాగంలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగంతో చంద్రమండలం నివాసయోగ్యమేనా? అక్కడ హైడ్రోజన్‌, ఇతర ఖనిజాలు ఉన్నాయా? అనే అంశాలను తెలుసుకోవచ్చన్నారు. 


మాటల్లో వర్ణించలేము (ఉమామహేశ్వరరావు-ఖమ్మం)
బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో ఖమ్మం నగరానికి చెందిన వల్లూరు ఉమామహేశ్వ రరావు ఆపరేషన్స్‌ మేనేజరుగా పనిచేస్తున్నారు. పదేళ్లలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో, చంద్రయాన్‌-2లో భాగస్వామిగా ఉన్నారు. చంద్రయాన్‌-3ని డిజైన్‌ చేసిన 30 మంది శాస్త్రవేత్తల బృందంలో ఉమామహేశ్వరావు ఒకరు. చంద్రయాన్ 3 లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేమన్నారు.


నాజీవితంలో మరచిపోలేని రోజు (జక్కుల సాయి తేజ-కొత్తగూడెం)
‘చంద్రయాన్‌-3’ ప్రయోగంలో రేంజ్‌ ఆపరేషన్‌ విభాగంలో కొత్తగూడెం మధురబస్తీకి చెందిన జక్కుల సాయితేజ పనిచేశారు. ఇస్రో పరిధిలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(శ్రీహరికోట)లో ‘సైంటిస్ట్‌ ఇంజినీరు-సి’ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన మంగళయాన్‌ మిషన్‌, 104 శాటిలైట్‌ మిషన్‌, పీఎల్‌వీ సీ-42, జీఎస్‌ఎల్‌వీ, ఆర్‌ఎల్‌వీ-45, చంద్రయాన్‌-2 సహా సుమారు 45 ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నారు. చంద్రయాన్ 3 తన జీవితంలో మరచిపోలేని  ప్రయోగం అన్నారు.