Andhra Pradesh News: ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు ఎంతో మంది ఉంటారు. అలాగే బతుకు దెరువు కోసం దుబాయ్ కు వెళ్లిన ఓ వ్యక్తికి లక్ష్మీ దేవి తలుపు తట్టింది. అతను ఏకంగా రూ.2 కోట్లకు పైగా లాటరీ గెలిచాడు. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, తనకేమీ గెలుపు ఊరికే దక్కలేదు. నెల నెలా తాను పొదుపు చేసిన మొత్తంలోనుంచే అతను ఈ లాటరీ టికెట్ గెలిచాడు.


ఉపాధి కోసం అరబ్‌ దేశం యూఏఈలోని దుబాయ్‌ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం పట్టింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నాడు. బ్యాంకుల్లో సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు ఆఫర్ కింద లక్కీ డ్రా నిర్వహించగా అందులో సదరు యువకుడు గెలిచాడు.


ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం 2017లో యూఏఈ వెళ్లాడు. దుబాయ్‌ లో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలా కరెంటు పని చేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన జీతం నుంచి నెల నెలా కొంత డబ్బు దాదాపు 100 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీరమ్స్‌ను నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేస్తూ వచ్చాడు. అయితే, ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి బ్యాంకు సదరు నిర్వాహకులు రివార్డు ప్రోగ్రామ్‌ కింద లక్కీ డ్రా తీశారు. దీంతో అతని పేరు రావడంతో భారీ మొత్తాన్ని గెల్చుకున్నాడు.


గ్రాండ్‌ ప్రైజ్‌ అనే కేటగిరీలో తీసిన లాటరీలో బోరుగడ్డ నాగేంద్రమ్‌ అందరికంటే ముందు విజేతగా నిలిచారు. అలా నగదు బహుమతి దాదాపు 1 మిలియన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీరమ్స్‌ అందుకున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.25 కోట్లకు పైనే. ఈ ప్రైజ్‌ మనీ గెలిచినట్లు నిర్వాహకులు బోరుగడ్డ నాగేంద్రమ్ కు తెలపడంతో ఇక ఆయనకు అంతులేని ఆనందం పొందాడు. ఆ డబ్బు తన పిల్లల ఉన్నత చదువుల కోసం తనకు అక్కరకు వస్తుందని.. వారి భవిష్యత్తు బంగారంగా ఉంటుందని నాగేంద్రమ్ ఆనందం వ్యక్తం చేశాడు.