Breaking News: భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 22 Sep 2021 05:20 PM
భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్లెదుటే ఓ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆపాల్సిన భర్త మాత్రం ఆత్మహత్య ఘటనను వీడియో తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ వివాహిత ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌ పర్సన్‌గా పని చేస్తోంది. ఆమె పేరు కొండమ్మ. భార్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను బంధువులకు సైతం షేర్ చేసి పైశాచిక ఆనందం పొందిన భర్త. 

MAA ఎన్నికల హీట్.. రేపు ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. రేపు తన ప్యానెల్ సభ్యులను నటుడు మంచు విష్ణు ప్రకటించనున్నారు. ఇప్పటివకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించనున్నారు.

రేపటిలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలి: కేటీఆర్

అన్ని కమిటీల ఏర్పాటు ఈ నెల 23 (రేపు) లోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ఆయన ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా జిల్లా పార్టీ , రాష్ట్ర కార్యవర్గం పూర్తి కావాలని ఆదేశించారు. ఈ నెల 24 లోగా తెలంగాణ భవన్‌కు నియోజకవర్గాల వారీగా సంస్థాగత నిర్మాణ వివరాలు అందజేయాలని పార్టీ నేతలకు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల స్కాంలో మరికొందరి ప్రమేయం ఉందన్న అనిశా అధికారులు తేల్చినట్టు సమాచారం. ఏపీ సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్రను గుర్తించారు. ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉందని తెలిసింది. ఇప్పటికే కొందరు నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం.

కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలా? మీ అభిప్రాయం తెలపండి: కేటీఆర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రజల అభిప్రాయం కోరారు. కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న అభిప్రాయాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలంతా ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కంటోన్మెంట్‌ బోర్డు పాలన సరిగా జరగడంలేదని, ప్రజల అవసరాలు తీర్చడంలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు.. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి





గ్రామస్థుడ్ని కాలితో తన్నిన సర్పంచ్

గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించిన సామాన్యునిడిని టీఆర్ఎస్ సర్పంచ్ కాలుతో తన్నాడు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దామస్తాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్వక్తి తమ గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలు చాలా ఉన్నాయని, నీటి సమస్య, డ్రైనేజి సమస్య తీర్చాలని సర్పంచ్ పిట్టల శ్రీనివాస్ కోరాడు. దీంతో సర్పంచ్ జైపాల్ రెడ్డి నీకెందుకని దాడి చేశాడు. గ్రామ సమస్యలు అడగడానికి వస్తే తనను ఇలా తన్ని వెళ్లగొట్టారని వాపోయాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేయగా.. తాము పరిశీలిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. 

అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోడీ

అమెరికాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తొలిసారి నేరుగా నిర్వహిస్తోన్న క్వాడ్​ సదస్సులో పాల్గొననున్నారు. క్వాడ్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగించనున్నారు.

ఈడీ ఆఫీసుకు తరుణ్

సినీ ప్రముఖుల విచారణ క్లైమాక్స్‌కు చేరింది. బుధవారం ఈడీ ముందుకు నటుడు తరుణ్ హాజరయ్యారు. ఇప్పటి వరకు 11 మందిని విచారణ జరిపిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఇవాళ ప్రశ్నించనున్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తరుణ్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఆయనకు అందిన నోటీసుల మేరకు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్ కలకలం

ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల ఎంపీటీసీ సభ్యుడు శ్యాంసన్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఈనెల 20న ఇంటి నుండి బయటకు వెళ్లిన తన భర్త కనిపించటం లేదంటూ శ్యాంసన్ భార్య పరమగీతం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా యద్దనపూడి ఎంపీపీ పదవి విషయంలో వైసీపీకి చెందిన ఇరువర్గాల నేతల మధ్య పోటీ తలెత్తింది. ఎంపీపీ రేసులో ఉన్న వారే శ్యాంసన్‌ను క్యాంపుకు తరలించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అండమాన్‌లో భూకంపం

అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 11.45 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రతతో భూమి కంపించింది. పోర్ట్‌బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఇంతకు ముందు ఈ నెల 11వతేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో రిక్టర్‌ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీవుల్లో తరచూ సంభవిస్తున్న భూకంపాలతో జనం తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

ఏపీలో నవంబరు మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు

నవంబరు మొదటి వారం నుంచి పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 73 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి సేకరణ జరుగుతుందని వివరించారు. పత్తి సేకరణకు సంబంధించిన విధి విధానాలపై సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులతో మంగళవారం ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పారు.

Background

ఏపీ ప్రభుత్వ బడుల్లో బుధవారం పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, పాఠశాలల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటన, 1.30 గంటలకు ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక, రెండు గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం మూడు నుంచి 3.30 గంటల మధ్య తొలి పేరెంట్స్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.