TDP NEWS :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రనాయుడు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని , తన హక్కులను కాలరాశారని గాంధేయపద్దతిలో నిరాహారదీక్ష చేశారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆయనకు మద్దతుగా బయట టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షల్లో పాల్గొన్నారు. 


ఢిల్లీలో లోకేష్ - రాజమండ్రిలో భువనేశ్వరి దీక్షలు


చంద్రబాబు కేసు విషయంపై సుప్రీంకోర్టులో వాదనల కోసం న్యాయనిపుణులతో సంప్రదించేందుకు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.  ఈ సందర్భంగా గాంధీ జయంతి రోజున ఢిల్లీలోనే  నిరాహారదీక్ష చేశారు. ఈ శిబిరానికి సొంత పార్టీ నేతలతో పాటు ఇతరులు పలువురు వచ్చి సంఘిభావం తెలిపారు. ఇండియన్ జర్నలిస్ట్స్ సంఘం నాయకుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు చాలా మంది జాతీయ పార్టీల నేతలు వచ్చి లోకేష్‌కు తమ సంఘిభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ కేసుల నుంచి త్వరలోనే బయటపడతారన్నారు. మరో వైపు నారా భువనేశ్వరి రాజమండ్రి టీడీపీ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో దీక్ష చేశారు. ఈ దీక్షా శిబిరానికి పెద్ద ఎత్తువ మహిళలు తరలి వచ్చి సంఘిభావం తెలిపారు. 


 





 


రాష్ట్ర వ్యాప్తంగా సంఘిభావం  తెలిపిన క్యాడర్ 
 
 ఊరూవాడా టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్న సానుభూతిపరులు కూడా దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులేనని.. మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల్ని జైల్లో పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలిచేయాలనుకోవడం నియంతల లక్షణమని మండిపడ్డారు. తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా తాము  మాత్రం గాంధీ  మార్గంలోనే పోరాడతామని స్పష్టం చేశారు. ఈ రోజు దీక్షలు చేశామని.. రేపు మరో విధంగా నిరసన తెలియచేస్తామని అంటున్నారు.  తెలంగాణలోనూ నిరసన దీక్షలు జరిగాయి.  ఏపీ ప్రభుత్వ అక్రమ కేసులపై పోరాడేందుకు.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు టీడీపీ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ప్రజల నుంచి  మద్దతు లభిస్తోందని చెబుతున్నారు.  


 





 


సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ 


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసు విషయంలో అక్టోబర్ 3 మంగళవారం అత్యంత కీలకం కానుంది. జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారణ జరపనుంది . కోర్ట నెంబర్ 6.. అరవై మూడో కేసుగా విచారణకు వస్తుంది. వాస్తవానికి సుప్రీంకోర్టులో మొన్న బుధవారమే విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనంలో జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి కారణాన్ని ప్రస్తావించడంతో విచారణ వాయిదా పడింది. భట్టి సభ్యుడిగా లేని బెంచ్ ముందు విచారణకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రయత్నించారు. అయితే కేసు అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దాంతో కేసును జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్‌కు బదిలీ చేసి విచారణను అక్టోబర్ 3 మంగళవారానికి వాయిదా వేశారు.