ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరామర్శలు, ఓదార్పు యాత్రలకు సంబంధించి అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోకేష్ నరసరావుపేట బయల్దేరారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పర్యటనకు ముందస్తు అనుమతి లేని కారణంగా లోకేష్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి లోకేష్పై కేసు కూడా నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా జగన్పై లోకేష్ సెటైర్లు విసిరారు. గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్ర వీడియోలను పంచుకున్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే ఎవరో పర్మిషన్ తీసుకోవాలని తనకైతే తెలియదు అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. 'జగన్ రెడ్డి మాట తప్పడు.. మడమ తిప్పడు.. నెవ్వర్ బిఫోన్, ఎవ్వర్ ఆఫ్టర్' అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.
ఇక ఇటీవల చనిపోయిన రమ్య కుటుంబాన్ని జగన్ కలవడంపై లోకేష్ మండిపడ్డారు. ఓదార్పు అంటే చనిపోయినవారి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి పరామర్శించాలి కానీ, వాళ్లని మన దగ్గరకు పిలిపించుకుని చేసేది కాదని విమర్శించారు. ఇది మన తెలుగు సంస్కృతి కాదని అన్నారు. 'కూతురు చనిపోయి బాధలో ఉంటే.. వాళ్లని ఇంటికి పిలిపించుకుని ఓదారుస్తారా? ఇది తెలుగు సంస్కృతా? ఇప్పుడు చెప్పండిరా బ్లూ బఫూన్స్.. ' అని విమర్శలు చేశారు. అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడానికి అనుమతి కావాలా? అని లోకేష్ నిలదీశారు.