ఏపీలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నిత్యావసరాల ధరలు పెరగడాన్ని బాదుడే బాదుడుగా అభివర్ణించారు. సంక్షేమ పథకాల విషయం జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హాయాంలో సంక్షేమం కోసం 52 శాతం నిధులు ఖర్చు చేశామని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కేవలం 41 శాతం మాత్రమే కేటాయించిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఏర్పడిందని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పుతో పాటు బాదుడే బాదుడు ద్వారా వసూలు చేస్తున్న నిధులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.


చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘అమ్మఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. అమ్మ ఒడి కంటే.. నాన్న బుడ్డితో ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు. మనం 52 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టాం. మీరు ఖర్చు పెడుతున్నది 41 శాతం మాత్రమే. ఇప్పుడు చేస్తున్న అప్పులు, బాదుడే బాదుడు ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కడికి పోతుంది? అన్నా క్యాంటిన్లు, చంద్రన్న భీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య లాంటివి ఏమీ లేవు. అంతా మోసకారి సంక్షేమం. రైతులకు ఒకేసారి టీడీపీ రూ.50 వేలు రుణమాఫీ చేసింది. మీరు ఏమీ చేయలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.


‘‘గతంలో రూ.600 ఉన్న ఇసుక ట్రక్కు రూ.5 వేలకి పెరిగిపోయింది. సిమెంటు ధరలు కూడా పెరిగిపోయాయి. నిర్మాణ రంగం కుదేలయింది. మొత్తం అవినీతి. రూ.8 లక్షల కోట్ల అప్పు చేరిపోయింది. ఏమైనా అభివ్రుద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదు. సంక్షేమం, అభివృద్ధి ఏమీ లేకుండా ఏకంగా అప్పులు మాత్రం 8 లక్షల కోట్లకి చేరిపోయాయి. ఇలాంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేనే లేదు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం వద్ద మెడలు దించి రాష్ట్రాల హక్కులు తాకట్టు పెట్టారు. పోలవరంకు నిధులు కూడా సాధించలేకపోయారు.’’


‘‘మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. ఈ మూడేళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచారు. భయంకరమైన బాదుడే బాదుడు.. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక తప్పుని తప్పుగా ప్రశ్నిస్తే అవతలి వాళ్లు కరెక్ట్ చేసుకోలేని వాళ్లు చరిత్ర హీనులుగా మారిపోతారు. అలాంటి వాళ్లే వైఎస్ఆర్ సీపీ నాయకులు. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం సహా అనేక రాష్ట్రాలు తగ్గి్స్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. గ్యాస్, కరెంటు ఛార్జీలు అన్ని బాదుడే బాదుడు. అన్నీ కరెంటు కోతలే. రాని కరెంటు కోసం అధిక ఛార్జీలు. పాలన చేతకాకపోతే, అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పరిపాలన చేయండి. నీ వల్ల (సీఎం) ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.’’


పోలీసులకు చంద్రబాబు హెచ్చరిక
‘‘మన పోరాటం జగన్ రెడ్డితో కాదు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పోరాడుతున్నాం. దాంతో మనపైనే దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు భయం, టీడీపీ నేతలు కూడా భయంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే గొంతును నియంత్రించాలని చూస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. పోలీసులు కూడా వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యక్తిత్వం మార్చుకోకూడదు. మన హాయంలో ఇదే పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించారు. ఇప్పుడు పోలీసుల లాఠీలకు ఎవరూ భయపడేవాడే లేడు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ అందరూ ఆలోచించుకోండి. అనవసరంగా మీరు ఒక ఉన్మాది చేతిలో బలి కావొద్దు. జగన్ ను నమ్ముకొని గతంలో ఎంతో మంది అధికారులు జైలుకు పోయారు. భవిష్యత్తులో ఇలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.