Macharla Video :   మాచర్లలో జరిగిన ఘర్షణల విషయంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు కొనసాగిస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు  ఓ వీడియో విడుదల చేశారు. అందులో వైఎస్ఆర్‌సీపీ నేత చల్లా మోహన్ ఓ పెద్ద  కత్తి పెట్టుకుని నడి రోడ్డుపై కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోను విడుదల చేసిన యరపతినేని శ్రీనివాసరావు ఇలాంటివి పోలీసులకు ఎందుకు కనిపించవని ప్రశ్నించారు. ఈ కత్తి పట్టుకుని ఉన్న  చల్లా మోహన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతోనే మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని.. మరి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


ఇదేం ఖర్మ కార్యక్రమంలో వార్డుల్లో తిరుగుతున్నప్పుడు టీడీపీ, వైసీపీ  శ్రేణుల ఘర్షణ 


మాచర్లలో వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాచర్ల ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి ఎదురైన వైసీపీ శ్రేణులమధ్య మాటకు మాట పెరిగి విధ్వంసానికి దారితీసింది. జూలకంటి ఇల్లు, టీడీపీ కార్యాలయం , ఎర్రం పోలిరెడ్డితోపాటు పలువురు టీడీపీ నాయకుల ఇళ్లపై విధ్వంసానికి దిగారు. పోలిరెడ్డి నివాసంలో రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలు అపహరించారని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు. దీనిపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న గొడవేనని, పెద్ది చేయాల్సిన అవసరం లేదనే అర్థంలో మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. 


సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమం నిర్వహించారని పోలీసుల ఆరోపణలు


ఇదేం ఖర్మ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేతలు సమాచారం ఇవ్వలేదని.. అందువల్లే మాచర్లలో గొడవలు జరిగాయని డీఐజీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. దీన్ని టీడీపీ నేతలు ఖండించారు. తాము సమాచారం ఇచ్చామని.. ఆధారాలు కూడా చూపిస్తామని చెప్పారు. అటు.. ఇళ్లు, కార్యాయాలు తగలబెట్టడాన్ని చిన్న ఘటనగా ఎస్పీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు ఆత్మరక్షణ కోసం చేసిన దాడి వీడియోలను మాత్రమే ప్రదర్శించారని.. వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన దృశ్యాలను చూపించలేదని ఆరోపించారు. 


మాచర్ల ఘర్షణల్లో నలుగురు టీడీపీ నేతల్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు 


అటు మాచర్ల ఘటనలో అరెస్టులు ప్రారంభమయ్యాయి. టీడీపీ నేత కుమారుడు మున్నా మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్థరాత్రి వేళ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత చల్లామోహన్‌పై దాడి కేసులో.. మధు తండ్రిపై కేసు నమోదైంది. తండ్రి కోసం కుమారుడు మధును అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మాచర్ల ఘటనలో మధు ఇల్లు కూడా ధ్వంసం అయింది. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మరి కొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. చల్లా మోహన్ పై హత్యాయత్నం కేసులో..  ఏ వన్ గా జూలకంటి బ్రహ్మారెడ్డినే పెట్టారు. ఆయన ప్రస్తుతం ఆజ్ఞాతంలో ఉన్నారు.