TDP Leaders: ఏపీలో కనపడని 2 వేల రూపాయల నోట్లు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాయని టీడీపీ నాయకులు విమర్శించారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో వణుకు వస్తోందని విమర్శలు గుప్పించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా ఆ నోట్లను మార్చడానికి సిద్ధమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 


'పెద్ద ఎత్తున జరిగే మార్పిడిపై నిఘా పెట్టాలి'


దేశంలో 2 వేల నోటు ఉపసంహర నిర్ణయం ఆహ్వానించదగినదని టీడీపీ నాయకుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. దేశంలో బ్లాక్ మనీని అరికట్టించడంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చెప్పారు. 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని గతంలో పలు వేదికలపై చంద్రబాబు కోరారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూరగాయలు అమ్మేవారు, చిన్న దుకాణదారులు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇసుక, మద్యం అమ్మకాల్లో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చెలామణిలో ఉన్న మెజారిటీ 2 వేల రూపాయల నోట్లు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉందని ఆరోపించారు. ఇడుపుల పాయలోని నేలమాళిగల్లో 2 వేల రూపాయల నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం వస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఈ డబ్బులను వెదజల్లి లబ్ధి పొందాలని జగన్ మోహన్ రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు. గడువులోగా ఏ బ్యాంకులో అయినా పెద్ద ఎత్తున జరిగే నగదు మార్పిడిపై నిఘా పెట్టాలని అధికారులకు కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. 


'తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైంది'


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనపడని 2 వేల రూపాయల నోట్లు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ డబ్బుతోనే గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకోసం ప్రతి నియోజకవర్గంలో 2 వేల రూపాయల నోట్లు దాచారని అన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్, అక్రమ భూ లావాదేవీలతో లక్షల కోట్ల రూపాయలు జగన్ సంపాదించాడని నిమ్మల ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, లోటస్ పాండ్, బెంగళూరు ఎలహంకా నివాసాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. కేంద్ర సర్కారు కూడా ఏపీలో జరిగే 2 వేల నోట్ల మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు జగన్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా 2 వేల నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారన్న సమాచారం తమకు ఉందన్నారు. ఆర్బీఐ నిర్ణయంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని దుయ్యబట్టారు. 


మే 19న ప్రకటన, సెప్టెంబర్ 30 వరకు గడువు


2018లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అదే సమయం నుంచి గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు రెండు వేల నోట్లను సైతం రద్దు చేస్తారని పలుమార్తు ప్రచారం జరిగింది. ప్రజలు అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నోట్లు చెలామణిలో ఉండవని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. ఒకేసారి 20 వేల రూపాయల వరకు మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులపై ఏ ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేవలం రూ.2 వేల నోట్లతో లావాదేవీలు జరిపే వారు, రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారం నిర్వహించే వారికి ఈ నిర్ణయంతో కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు.