టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సజావుగా సాగేలా రక్షణ ఏర్పాట్లు చేయాలని, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగు దేశం  పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. పాదయాత్రను విఛ్చినం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
డీజీపీకి లేఖ...
66 రోజులుగా జరుగుతున్న తెలుగు దేశం పార్టి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అపూర్వ స్పందనన లభిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వేలాది మంది అభిమానులతో సాగుతున్న లోకేశ్ పాదయాత్రను విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఈ సందర్బంగా డీజీపికి రాసిన లేఖలో వర్ల రామయ్య ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న పాదయాత్ర చూసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలోని పెద్దలకు కన్ను కుట్టిందని ఆయన అన్నారు. తన సామ్రాజ్యంలో అడుగుపెడితే పాదయాత్రను భగ్నం చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బీరాలు పలుకుతున్నారని, అరాచకం, దౌర్జన్యాలకు పేరుగాంచిన పెద్దిరెడ్డి పాదయాత్రను భగ్నం చేస్తానని చెప్పటం సరికాదన్నారు.
డీజీపీ వెంటనే తాడిపత్రి ఎమ్మెల్యేపై చట్యపరమైన చర్యలు తీసుకొని నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలు లేకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేశ్  పాదయాత్రను తాడిపత్రిలో జరగనివ్వనని ఎమ్మెల్యేకు హామీ ఇవ్వటం పోలీస్ అధికారిగా దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. పాదయాత్రకు ఏ ఆటంకం జరిగినా ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ పూర్తి బాధ్యత వహించాలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
జగన్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం... కన్నా మండిపాటు
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజల్ని తప్పుడు హామీలతో నమ్మించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9529 మెగావాట్లుగా ఉంటే, 2019 నాటికి దాన్ని19,080 మెగావాట్లకు పెంచి, ఆంధ్రప్రదేశ్ ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని అప్పగిస్తే, ఈ నాలుగేళ్లలో జగన్ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని, చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై డిస్కంలపై  భారం లేకుండా చేశారని గుర్తు చేశారు. 
జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లల్లో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా, ఏడు సార్లువిద్యుత్ ఛార్జీలు పెంచి, రూ.17,093 కోట్ల భారాన్ని ప్రజల పై, పారిశ్రామిక వేత్తల పై మోపారని కన్నా వ్యాఖ్యానించారు. తన అవినీతి కోసం విద్యుత్ డిస్కంలకు రూ.34,776కోట్ల బకాయిల భారం వేశారని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, హిందుజా సంస్థకు చెల్లించేందుకు చేసిన అప్పులు రూ.37,495కోట్లు కాగా,  తన కమీషన్లు, అక్రమార్జన కోసమే జగన్ విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారని కన్నా ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు యూనిట్ విద్యుత్ రూ.5కు ఇస్తుంటే, కమీషన్ల కోసం జగన్ ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ రూ.9కి కొంటున్నారని, కేసుల భయంతో సోలార్ విద్యుత్ వ్యవస్థని అదానీ పరం చేశారని కన్నా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి యూనిట్ విద్యుత్ రూ.5లకు లభిస్తుంటే, వాటిని కాదని జగన్ ప్రైవేట్ సంస్థల నుంచి యూనిట్ విద్యుత్ రూ.9లకు కొంటూ రూ.6వేలకోట్ల కమీషన్లు దండు కున్నారని ఆరోపించారు. 2014కు ముందు రూ.61వేలు ఉండే ట్రాన్స్ ఫార్మర్ ధరను జగన్ రూ.1,30,000లకు పెంచారని గుర్తు చేశారు. దీంతో జగన్ తన బినామీ కంపెనీ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు లభ్ది చేకూర్చారని ఆరోపించారు. 
వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని రైతులకు అందుబాటులో ఉంచకుండా, మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని, స్మార్ట్ మీటర్ల బిగింపు, వాటి నిర్వహణకు మహారాష్ట్రవంటి రాష్ట్రాలు రూ.18వేలుమాత్రమే వసూలు చేస్తుంటే, జగన్ సర్కార్  రూ.30వేల ధరను నిర్ణయించిందని చెపపారు. రూ.13వేలకోట్లు ఖర్చుపెట్టి మరీ జగన్ ప్రభుత్వం, మీటర్ల బిగింపు కాంట్రాక్ట్ ను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి, మంత్రిపెద్దిరెడ్డి బినామీ కంపెనీ అయిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీకి కట్టబెట్టిందని చెప్పారు. తన కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రంలోని సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ లను గంపగుత్తగా అదానీకంపెనీకి అప్పచెప్పారని అన్నారు.