TDP News : కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి.. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థను వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కుని జగన్ ముఠా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు విక్రయిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత పట్టాభిరాం. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల శనగల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ముంబై కస్టమ్స్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కొన్ని ఫార్మా కంపెనీల ద్వారా ఐఎస్ఐఎస్  డ్రగ్స్‌గా పిలిచే ట్రెమడాల్ ట్యాబ్లెట్లను  తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటిని అంతర్జాతీయంగా నిషేధించారు. భారత్‌లోనూ నిషేధించారు. ఈ అంశంపై మీడియా సమావేశం పెట్టిన పట్టాభి వైఎస్ఆర్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. 


టెర్రరిస్టులు విపరీతంగా వాడే ఈ ట్రెమడాల్ డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారడం విచారకరమని పట్టాభిరాం అన్నారు. డ్రగ్స్ మాఫియా వల్ల ‘కలెక్షన్ క్వీన్’ విడదల రజిని నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లో పెద్దల వరకు అందరికీ ముడుపులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఈ డ్రగ్స్‌ను తయారు చేయటం సాధ్యం కాదని ఆరోపించారు.    గతంలో ఒకసారి అంబటి రాంబాబు కూడా ఈ సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీని సందర్శించి వారిని వెనకేసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నార్కోటిక్స్ బ్యూరో, కేంద్ర కస్టమ్స్ విభాగం సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి చర్యలకు ఉపక్రమిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా మొద్దునిద్రపోతోందని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ డ్రగ్స్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టాభిరాం డిమాండ్ చేశారు.


ఐసిస్  డ్రగ్స్‌గా పిలవబడే ఈ ట్రెమడాల్ ట్యాబ్లెట్లను 2018 లోనే కేంద్రం నిషేధించిందని పట్టాభిరాం తెలిపారు. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థలో ఈ ట్యాబెట్లను ఉత్పత్తి చేసి ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా సౌత్ సూడాన్ రాజధాని జూబాకు ఎగుమతి చేయాలని జగన్ ముఠా  ప్రయత్నించిందని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాతో కోట్ల రూపాయలు దండుకున్న జగన్ రెడ్డి   తన ముఠా సభ్యుల చేత అత్యంత నీచంగా మాదక ద్రవ్యాలు తయారు చేయిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.  దేశంలో గంజాయి , డ్రగ్స్   ఎక్కడ పట్టుబడ్డా.. ఏపీలో మూలాలు బయటపడుతున్నాయని విమర్శించారు. 


సుమారు రూ. 750 కోట్లు విలువైన ట్రెమడాల్ డ్రగ్స్   ఏపీ కేంద్రంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి అయి ఉండవచ్చని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయన్నారు. 2019 వరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తూ మంచి పేరు సంపాదించుకున్న సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థను జగన్ ముఠా ఆ తర్వాత ఒక మాదకద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా మార్చిందని  ఆరోపించారు. ప్రభుత్వం ఈ కంపెనీపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.