ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు, వినియోగంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గంజాయి వలన యువత ప్రాణాలను కోల్పోతున్నారని, హంతకులుగా మారుతున్నారని మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్...
గంజాయి యువత ప్రాణాలు తీస్తుంది... ఎంతో మంది యువకుల్ని హంతకులనూ చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ఓ గంజాయి ఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. గంజాయిపై ఉదాసీనత దాన్ని మన బిడ్డల వరకూ తెస్తుందని చంద్రబాబు అన్నారు. విచ్చలవిడిగా గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు, ఏకంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కూడా తీస్తోందని ట్విట్టర్ లో అన్నారు. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసిందని ఇది చాలా విషాదకర ఘటనగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా మరో ఐదుగురు హంతకులుగా మారారని అన్నారు.  దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.






వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి అమాయక యువత జీవితాలు బలి అవుతున్నాయన్న విషయాన్ని అదికారులు  మర్చిపోవద్దని సూచించారు. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండని చంద్రబాబు సూచించారు.
ఇయర్ బడ్స్ కోసం గొడవ...
యువకుల మధ్య ఇయర్ బడ్స్ కోసం జరిగిన గొడవ.. చివరకు హత్యకు దారితీసిందని తెలుస్తోంది. యువకుడిని పలు ప్రాంతాల్లో తిప్పి తీవ్రంగా గాయపరచారు. చివరకు నగరంలోని జేడీ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడంటూ, వైద్యులను నమ్మించి ఆసుపత్రిలో చేర్పించి అక్కడ నుండి మిగిలిన మిత్రులు మాయం అయ్యారు. అయితే ఆ తరువాత కొద్దిసేపటికే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగిన తరువాత పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై చివరకు కేసు నమోదు చేసుకున్నారు. పటమట, పెనమ లూరు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం తేలకపోవటంతో ఉన్నతాదికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. డీసీపీ సూచనల మేరకు చివరకు పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూను శ్మశానం రోడ్డులోని శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నాగార్జున, అజయ్ సాయి, ప్రశాంత్, మణి కంఠ  మరో ఇద్దరు కలసి గంజాయి సేవించారు. గ్రూప్ లో ఒకరయిన అజయ్ సాయి ఇయర్ బడ్స్ తీసుకుని తిరిగి ఇవ్వలేదని  గొడవ తలెత్తింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో మిగిలిన ఐదుగురు కలిసి అజయ్ సాయిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అజయ్ సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వీరిలో నాగార్జున అనే యువకుడికి జేడీ నగర్ లో బంధువులు ఉన్నారు. అతని సలహా పేరు ప్రశాంత్ మణికంఠలు ద్విచక్ర వాహనంపై అజయ్ సాయిని జేడీ నగర్ సమీపంలోని పటమట డొంక రోడ్డులో ఉన్న ఆసుపత్రికి సోమవారం తెల్లవారు జామున తీసుకొచ్చారు. కండి పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి, చికిత్స నిమిత్తం  చేర్చించారు. మెడికో లీగల్ కేసు కావటంతో వైద్యులు కంకిపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అజయ్ సాయి మరణించాడు. ప్రమాదం వల్ల జరిగిన గాయాలు కావని వైద్యు పోలీసులకు తెలిపారు. ఈ విషయాన్ని పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు వ్యవహరం వెలుగులోకి వచ్చింది.