Chikoti Praveen :   క్యాసినో కింగ్  చీకోటి ప్రవీణ్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.  క్యాసినో కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది.   చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. ఇందులో సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాగా  మరో ముగ్గురు ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పట్టాయ కోర్టులో చీకోటి ప్రవీణ్ తో పాటు ఇతరులకు బెయిల్ వచ్చినప్పటికీ కొంత మంది ఇంకా ఇండియాకు చేరుకోలేదు.   
థాయ్‌లాండ్‌ నుంచి మే12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ కు వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ప్రవీణ్.   నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్‌ కు వెళ్లినట్లుగా తెలిపాడు.  దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా చీకోటి తెలిపాడు.  .   థాయ్‌లాండ్‌  లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చీకోటి చెప్పాడు.  తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని అన్నాడు. ఈ గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని తేలడంతో తాను చట్టపరంగా బయటకు వచ్చానని అన్నాడు.   చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్‌  కోర్టు  షరతులతో కూడిన  బెయిల్  మంజూరు చేసింది.  ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన   83 మంది భారతీయులకు కూడా  థాయ్‌లాండ్‌  కోర్టు బెయిల్ ఇచ్చింది.  4500 బాట్స్  జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది.  జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు  కూడా ఇచ్చేశారు.  


గతంలో కూడా చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది.  విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు విచారించారు. చికోటి కస్టమర్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు ఇలా చాలా మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్ లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ గుర్తించింది. 


పట్టాయ అధికారులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా రూ. వంద కోట్ల వరకూ గ్యాంబ్లింగ్  నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు.  క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మను నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సారి మొత్తం గుట్టు ఈడీ బయట పెట్టే అవకాశం ఉంది.