Minister Jogi Ramesh : హిందూ పురం ఎమ్మెల్యే బాల‌కృష్ణపై మంత్రి జోగి ర‌మేష్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ తుపాకీ పేల్చాల్సింది ఎవరి మీద అని ప్రశ్నించారు. అతికించుకున్న మీసాల్ని గట్టిగా తిప్పితే ఉన్నవి కాస్తా ఊడిపోతాయంటూ బాల‌కృష్ణను ఉద్దేశించి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఆనాడు కేరాఫ్‌ ‘నందమూరి’గా చంద్రబాబు వచ్చారని, అయితే నేడు మీరంతా కేరాఫ్‌ ‘నారా’ గా బతుకుతున్నారని అన్నారు. చంద్రబాబు కొడుక్కి నీ బిడ్డను ఎలా ఇచ్చావని ప్రశ్నించారు.


టీడీపీని లాక్కొన్నప్పుడు ఏంచేశారు? 


ఎన్టీఆర్‌ను ప్రజలకు దూరం చేసిందెవరని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ,ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్టు బాలకృష్ణ మాట్లాడుతున్నారని, చంద్రబాబు టీడీపీని లాక్కొన్నప్పుడు బాలకృష్ణ ఏంచేశారని ప్రశ్నించారు.  ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు పెట్టిన చిచ్చు మర్చిపోయారా అని నిలదీశారు.  చంద్రబాబు చేసిన ద్రోహంపై ఏ రోజైనా బాలకృష్ణ మాట్లాడారా? మంత్రి ప్రశ్నించారు.  


చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ 


ఎన్టీఆర్‌ పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఏరోజైనా ఆ ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు బాలకృష్ణ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  చంద్రబాబు పంచన చేరిన బాలకృష్ణకు వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని బాలకృష్ణ ట్వీట్‌ చేశారు. ఈ డైలాగులు సినిమాల్లో చెబితే బావుంటుందని హితవు పలికారు.  బాలకృష్ణ మూడ్రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి ఎన్టీఆర్ పేరును ఎవరూ చెరిపివేయలేరని, జాతికి ఆయనను దూరం చేయలేరన్నారు. అసలు జాతికి సమాజానికి ఎన్టీఆర్ ను ఎవరు దూరం చేశారని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. 


సినిమాల్లో ఫైట్లు కాదు 


ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు సీఎం జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టారని మంత్రి జోగి రమేష్ అన్నారు.  ఎమ్మెల్యే బాలకృష్ణకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ అయితే, పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అన్నారు.  గతంలో ఏంజరిగిందో బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. సినిమాల్లో ఫైట్లు చేయడం కాదని, ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారైతే ఆయన మరణానికి కారకులైన ఫైట్ చేయాలన్నారు. టీడీపీని, పార్టీ గుర్తును, ట్రస్టును లాగేసుకున్న చంద్రబాబుపై ఫైట్ చేయాలని సూచించారు.  ఎన్టీఆర్ చనిపోయిన 27 ఏళ్ల తర్వాత వచ్చి గుండెల్లో ఉన్నారు, గుడిలో ఉన్నారు, గుండీల్లో ఉన్నారని అంటే ఎవరూ నమ్మరన్నారు.  


జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించాం


యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దదని, చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టి గౌరవించామని మంత్రి జోగి రమేష్ అన్నారు. యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెడుతున్నట్టు మీడియాలో వస్తుంటే బాలకృష్ణ ఎందుకు అసెంబ్లీకి రాలేదని ప్రశ్నించారు. రక్తసంబంధాలను వదిలేసి ఎంగిలి మెతుకుల కోసం చంద్రబాబు పంచన చేరారని మండిపడ్డారు. సీఎం జగన్ నైతికత గురించి మాట్లాడే హక్కు బాలయ్యకు లేదన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరో, ఆయనను జాతికి, సమాజానికి దూరం చేసింది ఎవరో తెలియదా ప్రశ్నించారు. 


Also Read : TDP Ysrcp Dilemma : "ఎన్టీఆర్" పేరు మార్పు వివాదం - రెండు పార్టీల్లోనూ అలజడి ! ఏ పార్టీకి ఎక్కువ ఎఫెక్ట్ ?