Swarupananda : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖపై  విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ఆగ్రహం వచ్చింది. అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. స్వయంగా దేవాదాయ శాఖ ఉద్యోగుల కార్యక్రమానికి హాజరై.. ఆ శాఖ పైనే విమర్శలు చేయడం చర్చనీయాంశమయిది. 


దేవాదాయశాఖలో రెవిన్యూ ఉద్యోగుల అవసరం ఉందంటున్న స్వరూపానంద


దేవాదాయశాఖ అధికారుల తీరు వల్ల  భూవివాదాలు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని.. దేవుళ్ల ఆస్తులకు  రక్షణ లేకుండా పోయిందన్నారు. అందుకే దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ కారణం చూపి..  దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందన్నారు.  12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమని..  కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలని స్వరూపానంద పిలుపునిచ్చారు.  అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల దేవాదాయశాఖలో కొత్త ఉద్యోగులని నియమించడం కన్నా..  దేవాదాయ ఆస్తులు సంరక్షించడానికి రెవిన్యూ ఉద్యోగుల సేవలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీనపై దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వరూపానంద  సమర్థించినట్లు అయింది. 


ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తే ప్రమోషన్ల విషయంలో ప్రబుత్వంతో మాట్లాడతానని హామీ 


దేవాదాయశాఖలో ప్రమోషన్ల గురించి కొంత కాలంగా ఉద్యోగులు ప్రభుత్వానికి పలు రకాల విజ్ఞాపనలు చేస్తున్నారు. అయితే్ సమస్య పరిష్కారం కావడం లేదు. కోర్టుల్లో కేసులున్న కారణంగా ప్రభుత్వం కూడా పరిష్కరించలేకపోతోంది. అయితే స్వరూపానంద స్వయంగా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పడంతో దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో సంతృప్తి కనిపిస్తోంది. దీనికి కారణం ఉంది. స్వరూపానంద ప్రస్తుతం ఓ సాదాసీదా స్వామిజీ కాదు. ఆయన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. పైగా దేవాదాయశాఖలో ఆయన చెప్పినట్లుగా నడుస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దేవాదాయ శాఖ మంత్రే కాదు  పలువురు మంత్రులు తరచుగా ఆశ్రమాన్ని సందర్శిస్తూంటారు. సీఎం జగన్ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యం కల్పిస్తారు.  అందుకే స్వరూపానంద అండగా ఉంటే త సమస్య పరిష్కారం అవుతుందని దేవాదాయ శాఖ  ఉద్యోగులు భావిస్తున్నారు. 


ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా స్వరూపానంద


స్వరూపానంద ఎలాంటి విషయాల్లో అయినా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూంటారు. ఆయన పీఠానికి అనుకూలంగా ప్రభుత్వం భూముల కేటాయింపులు చేసింది. ఇవన్నీ ఆయనకు ప్రభుత్వ పెద్దల సన్నిహిత్యంతోనే వచ్చాయని చెబుతూంటారు.   దేవాదాయశాఖలో ఇటీవల స్వరూపానంద సలహాతో ఓ అడ్వయిజర్‌ను నియమించారు. కానీ ఆయన నియామకాన్ని కోర్టు కొట్టి వేసింది.  అయినప్పటికీ స్వరూపానందుక దేవాదాయశాఖలో మంచి పట్టు ఉందని అధికారవర్గాలు గుసగుసలాడుకుంటూ ఉంటాయి. అందుకే తమ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయననే పిలిచారని చెబుతున్నారు.