AP Sand Issue :  ఇసుక వ్యవహరం ఆంధ్రప్రదేశ్ లో మరో సారి చర్చ నీయాశంగా మారింది. ఈ సారి ఎకంగా సుప్రీం కోర్ట్ ఇసుక తవ్వకాల పై నిషేధం అమలు చేయాలని ఆదేశించింది.  ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల పై నిషేదం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో  నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిషేదించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( ఎన్జీటి)  ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడానికి  సుప్రీం కోర్టు నిరాకరించింది.   గత మార్చి 23న ఇసుక తవ్వకాల పై ఎన్జీటీ విధించిన నిషేదాన్ని తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది.  ఎన్జీటి తీర్పు పై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ  పిటీషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం, విచారించి తీర్పును వెలువరించింది.

  


బి2 కేటగిరీ ఇసుక రీచ్‌లలో పాక్షికంగా యంత్రాలతో ఇసుక త్వవకానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్దమని ఎన్జీటి పేర్కొంది. బి1, బి2 కేటగిరీల కింద ఇసుక తవ్వకాల కోసం ఇప్పటికే ఇచ్చిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను పరిశీలన చేయాలని ఎన్జీటి ఆదేశించింది. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పర్యావరణ అనుమతులను పునః పరిశీలన చేయాలని ఎన్జీటి అదేశించింది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల పరిధిలో పర్యావరణ విధ్వంసం పరిశీలన, అంచనా కోసం ఎన్జీటి నిపుణుల కమిటీని నియమించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని కూడా నిపుణుల కమిటీని ఆదేశించింది. రివర్ బెడ్లు, నదీ తీరాల్లో భారీ యంత్రాలతో మైనింగ్ చేసుకోవచ్చంటూ అనుమతివ్వడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఎన్జీటి విధించిన రూ.18 కోట్ల జరిమానాపై మాత్రమే సుప్రీం ధర్మాసనం స్టే విధించింది.


సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు  కారణంగా ఇసుక తవ్వకాలు పరిస్దితి ఎంటన్నది ప్రశ్నార్దకంగా మారింది. ఇప్పటికే ఇసుక సమస్య రాష్ట్రాన్ని వెంటాడుతోంది.  ఇసుక లభ్యత కొంత మేర సమస్యగా మారింది. మరో వైపున సర్కార్ ముంస్తుగానే ఇసుక డంప్ లను ఏర్పాటు చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ప్రవేట్ సంస్దల చేతులు మీదగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలు చేసి విక్రయాలు చేస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలకు సంబందించిన అంశం చాలా కీలకంగా మారింది. ఇసుక ను తెల్ల బంగారంతో పోల్చే పరిస్దితులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల పై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు భారీ ఉద్యమాలు నడిపించారు. అధికారంలోకి వస్తే ఇసుకను పారదర్శకంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తామని హమి ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తరువాత కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక పై ప్రత్యేకంగా శ్రద్ద చూపించింది. ఇసుకను పారదర్శకంగా ఇచ్చేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవటంతో పాటుగా ప్రైవేట్ సంస్దలకు బాధ్యతలను అప్పగించింది. అయితే దీని పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రైవేట్ సంస్దలకు ఇసుక తవ్వకాలు అప్పగించటం వెనుక రాజకీయ కోణం ఉందని, అందులో అధికార పక్షానికి చెందిన కీలక నేతల ప్రమేయం ఉందని, ప్రదాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టి నేతలు మండిపడుతున్నారు.