Vizag steel plant privatization : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ఇచ్చిన ఓ సమాధానం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వకగా చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని చెబుతూనే .. తమ నిర్ణయం మార్చుకోలేదని చెప్పడం ఏమిటని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. 

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని షర్మిల విమర్శించారు.  పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ తెరలేపారని ఆరోపించారు.   రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారు. విశాఖ స్టీల్ పై మోడీ   ఫార్ములా "సైలెంట్ కిల్లింగ్" అని అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని..  ప్లాంట్ ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలేనన్నారు. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలు. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. *మోదాని* కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును చంపడంలో కర్త మోడీ గారు అయితే  కర్మ, క్రియ చంద్రబాబు, పవన్ అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు  , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నామని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజిమెంట్‌   నుంచి వచ్చిన సమాధానం పై ఏం చెప్తారని నిలదీశారు. నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం నేటికి అమలు అనే సమాధానంపై మీ వైఖరి ఏంటి ? ప్లాంట్ ను ఉద్ధరించేందుకు మోడీ గారు ఇచ్చే అచంచలమైన మద్దతు అంటే ఇదేనా? ప్రైవేటీకరణ ఆపకపోవడమేనా వికసిత భారత్ - వికసిత ఆంధ్ర ? మీ నిబద్ధత, ఎన్నికల వాగ్ధానం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అంటే ఇదేనా ? కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా మోడీ గారు కుటిల ప్రయత్నాలు మానుకోవాలన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలి. తక్షణమే అధికారిక ప్రకటన చేయాలి. ఉద్యోగులను,కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్  ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ప్రైవేటీకరణ చేయాలని గతంలో కేంద్రం భావించింది. కానీ కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ తో .. కేంద్రం నుంచి ఇలాంటి సమాధానం రావడంతో మరో సారి రాజకీయ  ప్రకంపనలకు కారణం అవుతోంది.