YSRCP Special status: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా, నాటి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించడంపై మిథున్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. డిలిమిటేషన్ అంశంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని కీలక అంశాలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయని, హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు.
లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై మిథున్ రెడ్డి కీలక డిమాండ్లు లేవనెత్తారు. డీలిమిటేషన్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని కోరారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా, అన్ని రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగేలా ఈ ప్రక్రియ ఉండాలని సూచించారు. ముఖ్యంగా, డీలిమిటేషన్ అనేది విపక్షాలను అణచివేసే సాధనంగా మారకూడదని, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతూ సమతుల్యంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించిన మిథున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మహిళా సాధికారతకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, సంక్షేమ పథకాలు మరియు ఇళ్ల పట్టాల పంపిణీలో మహిళలకే అగ్రతాంబూలం ఇస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను అంగీకరిస్తున్నప్పటికీ, మహిళా భద్రత , డీలిమిటేషన్ అంశాల్లో తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్పేస్ లేకపోయినా.. ప్రత్యేకహోదా అంశాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించడం వెనుక ప్లాన్ ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఓ ఎజెండా సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ హైకమాండ్ ఈ మేరకు.. ఒక్కో అంశాన్ని టెస్ట్ చేస్తున్నారని.. ప్రత్యేకహోదా అంశంపై ప్రజల్లో కదలిక వస్తే దాన్ని ఎంచుకునే వ్యూహం ఉందని భావిస్తున్నారు.
