SP Rishant Reddy :  పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకటన చేశారు. పుంగనూరులో జరిగిన రాళ్ల దాడుల ఘటనల్లో ఇరవై మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. ఇందులో డీఎస్పీ కూడా గాయపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు. 

  
 
ఆ తర్వాత చంద్రబాబునాయుడు అక్కడి నుంచి అంగళ్లు గ్రామానికి వస్తున్నప్పుడు .. తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అంగళ్లు గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడానికే ఇలా వైసీపీ కార్యకర్తలు రోడ్డును బ్లాక్ చేశారన్నారు. ఇలా చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. తెలిపారు. అంగళ్లు గ్రామానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టారని ఎస్పీ తెలిపారు. 


వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మీద.. పోలీసుల మద దాడులు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారన్నారు. అలాగే డీఎస్పీని అవమనించేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పై రాళ్లు దాడులు చేశారన్నారు. అప్పుడు చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ దాడుల కారణంగా.. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడంతో చంద్రబాబును కాన్వాయ్ ను పుంగనూరు కు వెళ్లకుండా..  రోడ్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేసి.. దారి మళ్లించామని ..బైపాస్ రోడ్ మీదుగా రోడ్ షాను రూట్ మార్చామన్నారు. అయితే అప్పటికే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు.. పోలీసుల మీద దాడి చేశారని రిషాంత్ రెడ్డి తెలిపారు. 


టీడీపీ కార్యకర్తల దాడిలో రెండు పోలీసు వాహాలు తగలబబడిపోయాయనని తెలిపారు. ఇందులో ఒక బస్సు, ఒక  వజ్ర వాహనం ఉందన్నారు. ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. దాడులు చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించామని.. అయినా పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. 


ఉద్రిక్తతల కారణంగా చంద్రబాబును పుంగనూరులోకి రాకుండా అడ్డుకున్నమని.. అందుకే పోలీసులపై దాడులు చేశారన్నారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని ఎస్పీ చెప్పారు. పోలీసులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేశారని ..ఈ ఘటనలో  ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలి పెట్టేది లేదని ఆయన ప్రకటించారు.