Somu Veerraju fires at communists: బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కమ్యూనిస్టులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. భీమిలిలో బిజెపి పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కమ్యూనిస్టు పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కమ్యూనిస్టులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, దేశాభివృద్ధికి వారు ఆటంకమని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం రాజకీయ ఉనికి కోసమే కమ్యూనిస్టు నేతలు నిరాహార దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు మేత అందకనే ఇలాంటి దీక్షలు చేస్తున్నారు  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.   

కమ్యూనిస్టులు దేశానికి  నీచులు అంటూ ఆయన వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలో కూడా వారు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకున్నారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంటే, వీరు మాత్రం పనిగట్టుకుని బీజేపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.  

భీమిలి వేదికగా సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఖండిస్తున్నారు.  ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అవమానించడమే కాకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి భాష వాడటం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటాన్ని అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.