Singanamala YCP MLA Padmavathi: సింగనమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ సామాజిక సమీకరణలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. దాంతో సింగనమల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికు టికెట్ రాలేదు. అయితే తాను జగన్ (AP CM YS Jagan) వెంటే ఉంటానని, పార్టీ విజయం కోసం కృషిచేస్తా అన్నారు. జగనన్న నిలబెట్టిన అభ్యర్థిని సమన్వయంతో కలిసికట్టుగా మనమందరం పనిచేసి గెలిపించుకుందామని వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం జగన్ గొప్పతనాన్ని తెలుసుకొని ఎప్పటికైనా ఆయన చెంతకు వస్తుందన్నారు. సొంత చెల్లెలు వెంట లేకపోయినా, రాష్ట్ర వ్యాప్తంగా అక్కాచెల్లెమ్మలు సీఎం జగన్ వెంట నడుస్తున్నామని చెప్పారు.
తమ్ముడు వీరాంజనేయులును గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కుటుంబం వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్ గా ఎన్నికై అక్కడ ప్రజలకు పార్టీకి సేవలందించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి నా తమ్ముడు వీరాంజనేయులును వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆశీర్వదించాలని కోరారు. టిక్కెట్ తనకు ఇచ్చినా, ఇవ్వకపోయినా జగనన్న మాటకు కట్టుబడి జగనన్న చేస్తున్న అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని మేము నిర్వర్తించి వైఎస్ఆర్సీపీ జెండాని నియోజకవర్గంలో మరోసారి ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు కామెంట్స్తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టే ధైర్యం దమ్ము కేవలం జగనన్నకే ఉందని అన్నారు. శింగనమల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ఎమ్మెల్యే దంపతుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.