Siddhartha Kaushal VRS:  ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేశారు. యువ ఐపీఎస్ అధికారి అని కౌశల్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడంతో వైసీపీ నేతలు ప్రభుత్వ వేధింపుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం ప్రారంభించారు. దీంతో సిద్దర్థ కౌశల్ ఓ లేఖ విడుదల చేశారు.    స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనే తన నిర్ణయం వ్యక్తిగత కారణాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, అలాగే కుటుంబ ప్రాధాన్యతల కారణంగా  వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాననిప్రకటించారు. వేధింపులు లేదా ఇతర  బలవంతం కారణంగా తన రాజీనామా జరిగిందనే  ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు, అలాంటి వాదనలను "నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి" అని ఆయన స్పష్టం  చేశారు. సిద్ధార్థ కౌశల్ తన సర్వీసు విషయంలో సంతృప్తిగా ఉన్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో తన పదవీకాలాన్ని  తన జీవితంలో "అత్యంత సంతృప్తికరమైన ,  సుసంపన్నమైన ప్రయాణం" అని పేర్కొన్నారు.   

సిద్ధార్థ కౌశల్ 2000 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన సర్వీసులో కేవలం పదిహేనేళ్లు మాత్రమే అయ్యాయి. కృష్ణ, ప్రకాశం వంటి పలు జిల్లాల్లో ఎస్పీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో అడ్మిన్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయనకు పోస్టింగులు దక్కాయి. ఆయనపై ఎలాంటి విచారణలు జరగడలేదు. ఆరోపణలు కూడా లేవు. టీడీపీ నేతలు కూడా ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అయితే వైఎస్ఆర్‌సీపీ హయాంలో పలువురు ఐపీఎస్ అధికారులు నిబంధనలను అతిక్రమించి.. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని,అలాంటి వారిని వదిలేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏడాది నుంచి చాలా మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు దక్కలేదు. ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సీతారామాంజనేయులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

సినీ నటి జత్వానీ కేసులో పలువురు ఐపీఎస్‌లు జైలుకు వెళ్లాల్సి ఉండగా.. ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో  వారు ప్రస్తుతానికి బయటే ఉన్నారు. అయితే వారికి పోస్టింగులు లభించలేదు. ఇలాంటి వారి జాబితాలో సిద్ధార్థ కౌశల్ ఎప్పుడూ లేరు.  ఐపీఎస్ గా  ఆంధ్రప్రదేశ్ లో పని చేయడం కన్నా.. ఢిల్లీలో కుటుంబంతో ఉండాలని.. ఆయన  కుటుంబం ఒత్తిడి చేసినట్లుగా చెబుతున్నారు. కార్పొరేట్ సంస్థలో మంచి పోస్టింగ్ లభించడంతో ఆయన వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రముఖ ఎమ్మెన్సీలో కీలక పోస్టులో సిద్దార్థ కౌశల్ చేరబోతున్నారని .. అలా చేయడమే ఆయన కుటుంబ ఆకాంక్ష అని చెబుతున్నారు. అయితే ఆయన వీఆర్ఎస్ తీసుకోవడం.. రాజకీయ వివాదం కావడంతో  అధికారిక లేఖ విడుదల చేశారు.