Andhra  News : ప్రత్యేకహోదా విషయంలో పదేళ్లుగా ప్రజల్ని రెండు పార్టీలు గొర్రెల్ని చేస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతున్న సమయంలోనే భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.  రాష్ట్రానికి ఆన్యాయం చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్లకి అధికారం ఇచ్చారన్నారు.  రాష్ట్రం అన్యాయం జరుగుతుందని  గద్గద స్వరంతో కన్నీరు పెట్టుకున్నారు. హోదా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల  స్లోగన్ కాదని..  రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమేనని స్పష్టం చేసారు.  కాంగ్రెస్ పార్టీ అందుకే హోదా డిక్లరేషన్ ప్రకటించిందని స్పష్టం చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పార్టీలో చేరడానికి వచ్చిన నేతలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. వారితోప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా  ప్రతిజ్ఞ  చేయించారు. ఈ సందర్భంగా భావోద్వేగపూరితంగా  ప్రసంగించారు. 



ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు


పదేళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదు.. హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారు.. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.  ఉద్యమం ఉవ్వెత్తున జరగక పోతే మనకు హోదా రాదు .. 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదు..ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ప్రజలు గొర్రెలు లెక్క కాదు...సింహాల లెక్క బ్రతకాలి అన్నాడని ..గొర్రెలను బలి ఇస్తారు..సింహాలను బలి ఇవ్వరు అని అన్నారని గుర్తు చేశారు. హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం అందుకే మనల్ని బలి ఇచ్చారన్నారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడు  ..తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడు.. ఇప్పుడు మనం గొర్రెలం కాదు సింహాలం అని స్పష్టం చేశారు. 


పదేళ్లు మనల్ని గొర్రెల్ని చేశారు ! 


సింహాల లెక్క పోరాటం చేయక పోతే హోదా రాదని.. పోరాడితే పోయేది ఏమి లేదు..బానిస సంకెళ్లు తప్పా అని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు మనం మంచితనం గా ఉన్నది చాలు ..మంచితనం ఉంటే మనకు హోదా ఇవ్వలేదన్నారు. మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా అని ప్రశ్నించారు. ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్ .. మోడీ ఒక KD...హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేదన్నారు. హోదా వస్తె 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవి. అభివృద్ధిలో ఎక్కడో ఉండే వాళ్ళం.. చంద్రబాబు కి రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు .. రక్తం పంచుకు పుట్టిన జగన్ ఆన్న కి సైతం అభివృద్ధి ధ్యాస లేదన్నారు. మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్ దన్నారు. 


బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ 
 
వ్యక్తిగత రాజకీయాల కోసం నేను ఆంధ్ర కు రాలేదని.. నాకు రాజకీయాలు కావాలంటే 2019 లోనే ఇక్కడ పార్టీ పెట్టే దాన్నని గుర్తు చేశారు. కేవలం హోదా సాధన,విభజన సమస్యల సాధన కోసమే అడుగు పెట్టానని స్పష్టం చేసారు. రాహుల్ ఇచ్చిన మాట పట్టుకొని YSR బిడ్డ ఆంధ్రలో అడుగు పెట్టిందన్నారు. హోదాపై మొదటి సంతకం పెడతా అని హామీ ఇచ్చారు కాబట్టే వచ్చా ..హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేనే లేదన్నారు.  హోదా సాధన వరకు విశ్రమించేది లేదన్నారు. బీజేపీ కి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేడు,ఒక్క ఎమ్మెల్యే లేడు ..అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఎలుతుందని విమర్శించారు. బాబు,జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు .. బాబు అధికారంలో ఉంటే బీజేపీ ఉనట్లే .జగన్ ఉన్నా బీజేపీ ఉన్నటేనన్నారు.  బీజేపీ నిర్ణయాలను ఒక్కరోజు వ్యతిరేకించరు ..మోడీకి ఊడింగం చేస్తున్నారు ..బీజేపీ తో ఉన్న అక్రమ పొత్తులకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త జనాలకు అర్థం అయ్యేలా చెప్పాలని కార్యకర్తలకు పిలుపునచ్చారు.