Sharmila On Jagan: తల్లి మీద కేసు వేసిన వాడుగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో వక్ఫ్ బిల్లు అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్ పై చర్చ జరిగింది. జగన్  స్వయంగా MOU లో సంతకం పెట్టారని .. ఆస్తులు ఎవరికి ఏవి అనేది సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. గిఫ్ట్ ఇచ్చింది నాకు కాదు.. తల్లి విజయమ్మకు అని గుర్తు చేశారు. ఇచ్చిన షేర్లను వెనక్కి అడుగుతున్నారు..ఇది తల్లికి చేస్తున్న మోసమన్నారు. నన్ను అఫెక్ట్ చేసే స్థాయి ఎప్పుడో జగన్ సరిపోయాడు.. నా పిల్లలను మోసం చేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని విమర్శించారు. "తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు. జగన్ రెడ్డి నాకు నా ఆస్తులు ఇస్తారో లేదో... ఇంక ఐ డోంట్ కేర్ అని ప్రకటించారు. 

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీలో కేసు వేసిన జగన్

తెలియకుండానే తమ పేరిట ఉన్న 51 శాతం వాటాలను అక్రమంగా విజయమ్మ, షర్మిల బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దుచేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్‌, భారతి, వారి కంపెనీ క్లాసిక్‌ రియాల్టీ హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌  లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తాజాగా జగన్ ఓ అఫివిట్ దాఖలుచేశారు. ఎంవోయూపై సంతకం పెట్టానని జగన్ అంగీకరించారు. అయితే  ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారని..  షేర్ల పత్రాలు, షేర్ల బదిలీ పత్రాలు  తన వద్దే ఉన్నాయని..  భౌతికంగా గిఫ్ట్‌ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్‌ డీడ్‌ పూర్తవుతుందని.. జగన్ తరపు లాయర్ వాదించారు. 

అసలు నేను గిఫ్ట్‌ ఇవ్వలేదని బహుమతి నావద్దే ఉందని.. ప్రస్తుతం బహుమతి ఇచ్చే ఉద్దేశం నాకు లేదని జగన్ లాయర్ ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకెళ్లారు. నా తల్లి విజయలక్ష్మి పేరిట సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీ అక్రమమని.. తన తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తోందని జగన్ ఆరోపించారు. నా తల్లి, చెల్లిపై ప్రేమ, అభిమానాలు పోయాయని అందుకే ఎంవోయూనూ  గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నానని తెలిపారు.  ఎంవోయూ షరతులతో కూడినప్పుడు గిఫ్ట్‌ డీడ్‌ కూడా షరతులతో కూడినదేనని.. షరతులు ఉల్లంఘించారు కాబట్టి వాటిని రద్దు చేసుకుంటున్నామని జగన్ తరపు లాయర్ ఎన్సీఎల్టీలో వాదించారు.         

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ  సమయంలో ఆస్తులన్నీ ఇద్దరికీ చెందుతాయని వైఎస్ నోటి మాటగా చెప్పారని..   కానీ ఆయన చనిపోయాక జగన్ ఆస్తులన్నీ తాను ఒక్కడే కాజేస్తున్నాడని షర్మిల ఆరోపిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. చాలా ఆస్తులు ఇంకా అక్రమాస్తుల కేసుల్లో జప్తులో ఉన్నాయి.