Satyavedu MLA Rs 100 crores:  సత్యవేడు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.  తన తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక పెద్ద  రాజకీయ కుట్ర ఉందని, తమను రాజకీయంగా సమాధి చేసేందుకు కొందరు కావాలనే లైంగిక ఆరోపణల డ్రామా ఆడించారని ఆయన  ఆరోపించారు.  ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ కోసం తాము ఇప్పటివరకు రూ. 100 కోట్లు  ఖర్చు చేశామని, ఆ డబ్బును తమకు తిరిగి ఇచ్చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన సంచలన డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను తొక్కేస్తున్నారని ఆరోపిస్తూనే,  గౌరవం లేని చోట మేము ఉండలేం, మా డబ్బే మాకు ముఖ్యం  అనే రీతిలో బాబు, లోకేష్‌లను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Continues below advertisement

కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిన కోనేటి ఆదిమూలం

 సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై 2024 సెప్టెంబర్‌లో ఒక మహిళా టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కొన్ని వీడియోలను బయటపెట్టడం పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టీడీపీ అధిష్టానం, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందన్న కారణంతో తక్షణమే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, ఆ తర్వాత బాధితురాలు కోర్టులో తన ఆరోపణలు వెనక్కి తీసుకున్నప్పటికీ, అధిష్టానం మాత్రం ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. ఇది ఆ కుటుంబంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

Continues below advertisement

 సుమన్ ఆవేదన వెనుక అసలు కారణం 

సస్పెన్షన్ ఎత్తివేయకపోవడమే కాకుండా, సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలాన్ని కాదని గంగా ప్రసాద్ వంటి ఇతర నేతలను ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నాలు జరుగుతుండటం సుమన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత, ఒక ఆరోపణ రాగానే తమను ఇలా పక్కన పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే,  మేము పెట్టిన రూ. 100 కోట్లు ఇచ్చేస్తే రాజీనామా చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

 సత్యవేడు టీడీపీలో వర్గపోరు 

సత్యవేడు టీడీపీలో ఆదిమూలంకు, ఇతర స్థానిక నేతలకు మొదటి నుంచీ పొసగడం లేదు. ప్రోటోకాల్ విషయంలోనూ, నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలోనూ ఆదిమూలం వర్గాన్ని ఇతర నేతలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలు కూడా ఒక పథకం ప్రకారం జరిగిన కుట్రలో భాగమేనని, తన తండ్రి   రాజకీయ జీవితాన్ని ముగించేందుకే ఈ డ్రామా ఆడారని సుమన్ ఆరోపిస్తున్నారు.

 సస్పెన్షన్ ఎందుకు కొనసాగుతోంది? 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే ఆదిమూలంపై సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలు బయటకు రావడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని, మళ్ళీ ఆయనను చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో, సత్యవేడులో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయడంపై లోకేష్ దృష్టి సారించడంతో ఆదిమూలం కుటుంబం ఇప్పుడు గొంతు పెంచింది. ప్రస్తుతం సత్యవేడు టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఆదిమూలం తన పదవిని కాపాడుకుంటూనే మళ్ళీ పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఆయన కుమారుడు బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.