Bharati Phd :     ఆకలి, కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం సాకే భారతి.  రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది. ఇదంతా ఏదో సినిమా కథ కాదు... సాకే భారతి జీవితం.


అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె.  నిత్యం కూలి పనులు చేసి భారతి డాక్టర్‌ అయ్యింది.  రసాయన శాస్త్రంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురు కలిసి వచ్చింది భారతి. పారగాన్‌ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలసైతం ప్రత్యేక గౌరవం ఇచ్చారు .


పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేసింది.  తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. 


భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా...ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు.  భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది.                     


తన కూతురు గాయత్రి. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్లీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది.  కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్సెక్కేది.           


ఇన్ని కష్టాల మధ్యా భారతి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు. ప్రయత్నిస్తే ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా తను కూలి పనులు మానలేదు. 


'‘డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుందని ఆమె చెబుతూ ఉంటారు.               
 
సాకే భారతి ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.ఎందరితో ఆదర్శమని పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.