Sajjala On Babu : చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ప్రముఖ పత్రికల్లో వచ్చినా  చంద్రబాబునాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎందుకు స్పందించలేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రదర్శించారు.  సాక్షాధారాలతో సహా  అన్ని  వివరాలు ఉన్నాయన్నారు.  అమరావతి  అనే భోగస్  ప్రాజెక్ట్  తో  చంద్రబాబు  పెద్ద  స్కామ్  చేశారని  ఆరోపించారు.  రాజధాని  కట్టాలని  ఆలోచన  చంద్రబాబు  కు  లేదని..  చంద్రబాబు ప్రతి  ఆలోచన  పెద్ద  స్కామ్ అని ఆరోపించారు.  ఏది  లేని  ఒక  ఎడారి  లో   వేలకు  వేలు  రేట్లు  పెట్టిన  చంద్రబాబు  స్కామ్  స్టార్ అన్నారు.  నాలుగు  వేల  ఎకరాలు  బినామీ  ల  పేరుతో  తన  వారసులకు  రిజర్వ్  చేసుకున్నాడని ఆరోపించారు. 


మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తిని విచారించే క్రమంలో అతను స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. నేరుగా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అని ఆరోపించారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెలకు కాంట్రాక్టు ఇచ్చారు.. ఈ రెండు కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీలకు మళ్లినట్లు ఆధారాలతో సహా నోటీసులో పేర్కొన్నారని తెలిపారు.. ఈ విషయాలు బయటకు వచ్చి 48 గంటలు అయినా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించ లేదన్న ఆయన.. ఈ కేసులో జోన్ షిఫ్ట్ అనే సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆలస్యం చేస్తూ వస్తున్నారని విమర్శించారు.


అసలు ఆరోపణలపై స్పందించకుండా వ్యవస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు సజ్జల.. స్టే తెచ్చుకుని కాలం గడిపేసే అలవాటు చంద్రబాబుదన్న ఆయన.. మాకు దొరికిన ఆధారాల ప్రకారం లెక్కలో లేని ఆదాయం బోగస్ కంపెనీల నుంచి మళ్లీ మీకే చేరాయి అని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో స్పష్టంగా ఉందన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు కె.రాజేష్ పాత్ర గురించి ఐటీ శాఖ నోటీసులో ఉందన్నారు సజ్జల. ఇక, అమరావతి ఒక స్కామ్‌.. ఈ పేరుతో తాను, తన అనుచరులు కొన్ని తరాల పాటు దర్జాగా బతికే కుట్ర చేశారన్నారు. 


టిడ్కో హౌసింగ్ కూడా మరో స్కామ్‌గా అభివర్ణించిన ఆయన.. వెయ్యి రూపాయలు అయ్యే ఎస్ఎఫ్‌టీ ఖర్చును రెండు వేల రూపాయలకు చూపించారు.. 25 ఏళ్ల పాటు పేద ప్రజలు అప్పుల భారం మోసేలా చంద్రబాబు ప్రయత్నం చేశారని ఆరోపించారు.మనోజ్ వాసుదేవ్ పార్థసాని తాను చంద్రబాబును తరచూ కలిసినట్లు ఐటీ శాఖ దగ్గర వెల్లడించాడని పేర్కొన్నారు సజ్జల.. చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డ ఆయన.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని తేలినా ఈడీ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నోటీసుల దశలోనే కేసు తిరుగుతోంది.. కేంద్ర నిఘా సంస్థలు అన్నీ ఈ అంశం పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆధారాలతో కోణంలో మరింత లోతుగా విచారణ చేస్తామని.. కేంద్ర ఏజెన్సీలను కూడా అడుగుతాం అని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి.