RGV On Jagan Governament :   ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ప్రకటన చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఖరారు చేయకుండా..  తాను విన్నానని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ఇటీవలి కాలంలో పూర్తిగా వైఎస్ఆర్‌సీపీ కి అనుకూలంగా మారింది. విపక్షాలపై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో  ఆర్జీవీ చేసిన ప్రకటన హైలెట్‌గా మారుతోంది. 


రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్‌సీపీ కోసం పని  చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కోసం రెండు సినిమాలు తీస్తున్నారు. దాని కోసం వ్యూహం అని పేరు పెట్టారు. ఎన్నికల టార్గెట్‌గా ఆ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆర్జీవీ ఇప్పటికే షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత అయిన దాసరి కిరణ్ కుమార్‌కు టీటీడీ బోర్డు సభ్యత్వం లభించింది. జగన్ బయోపిక్ అని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు.  ఈ చిత్రం ని రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి పార్ట్ “వ్యూహం”, రెండో భాగం “శపథం”. ఈ రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయన్నారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం” షాక్ నుంచి తేరుకునే లోపే వాళ్లకు ఇంకో ఎలక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం” లో తగులుతుంది… అంటూ  ప్రకటించారు.              
 
మామూలుగా అయితే ఆ సినిమాల విడుదల తేదీన సాధారణ ఎన్నికలకు ముుందు ఉండేలా షెడ్యూల్ చేసుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. అంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందే వెళ్లాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. ఆ రెండు సినిమాను ముందే సిద్ధం చేయాలని అంటే.. జూలై లేదా ఆగస్టుకల్లా సిద్దం చేసి విడుదల చేయాలని వైసీపీ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చి ఉంటాయని అందుకే.. ఈ ప్రకటన చేసి ఉంటారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.              


రామ్ గోపాల్ వర్మ  వ్యూహం, శపథం సినిమాల ప్రకటనకు ముందే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో  జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన ఇమేజ్ పెరిగేలా... ఎలాంటి సినిమాలు కావాలో వివరించినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు మహి వి రాఘవ్ అనే దర్శకుడు యాత్ర అనే సినిమాను తీశారు. ఇది వైఎస్ఆర్‌సీపీకి ప్లస్ అయిందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ సారి ఆర్జీవీతోనే రెండు సినిమాలు వైసీపీ వ్యూహకర్తలు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీ చెప్పారు కాబట్టి..ఏపీ అసెంబ్లీని సీఎం జగన్ జూన్ ఫస్ట్ వీక్‌లో రద్దు చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.             


అంతా చెప్పిన ఆర్జీవి  కాసేపటి తర్వాత  ఏప్రిల్ ఫూల్ అంటూ ట్వీట్ పెట్టారు. కానీ ఆయనకు వైసీపీ నుంచి వచ్చిన సూచనల మేరకే ఇలా చేసి ఉంటారని..  ముందస్తు ఎన్నికలపై ఏపీలో విసృతంగా జరుగుతున్నచర్చ గురించి నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.