Jaggampeta MLA Chantibabu : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్నవేళ అధికార వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP)కి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఆ పార్టీలో సీటు రాదని ఫిక్సయిన నేతలు జగన్ కు రాం రాం చెప్పేందుకు వెనుకాడటం లేదు. సీటు ఇస్తే ఒకే, లేదంటే మీకో నమస్కారం అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ (Jagan) వ్యవహారశైలిని, వైసీపీలో తమకు ఎదురైన అవమానాలపై లేఖలు రాస్తున్నారు. జగన్ కు నమ్మినబంటుగా ఉన్న వారు కూడా పక్క చూస్తున్నారు. కొందరు ఇప్పటికే దూరమయ్యారు. ఇంకొందరు కండువా మార్చేశారు. మొన్న విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ, నిన్న ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పార్థసారథిలు జగన్ వ్యవహారశైలిని బహిరంగంగానే తప్పు పట్టారు. ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేరిపోయారు. 


చంటిబాబు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమైన చంటిబాబు...పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలస్తోంది. పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో గంటకు పైగా చర్చలు కొలిక్కి రావడంతో ఆయన కండువా మార్చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. వాటన్నంటిని జ్యోతుల చంటిబాబు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తో కాకినాడలో సమావేశమైన ఆయన, ఏ క్షణమైనా వైసీపీ గుడ్ బై చెబుతారన్న చర్చ నడుస్తోంది. జగ్గంపేట టికెట్ విషయంలో వైసీపీ హైకమాండ్ నుంచి జ్యోతుల చంటి హామీ లభించకపోవడంతో పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చ ఎన్నికల్లో జగ్గంపేట టికెట్ ను మాజీ ఎంపీ తోట నరసింహం కుటుంబానికి ఇవ్వడం ఫిక్స్ అయింది. దీంతో జగ్గంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, కిర్లంపూడి, గండేపల్లి జడ్పీటీసీలు, కిర్లంపూడి ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతుల చంటిబాబు 2009, 14ల్లో జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారు. చంటిబాబు చేరికకు జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. 


కొత్త సంవత్సరంలో మరిన్ని చేరికలు
అసెంబ్లీ ఎన్నికలు తక్కువ సమయం ఉండటంతో చేరికలు మరింత పెరుగుతాయని జనసేన నేతలు భావిస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీ లేదంటే జనసేన నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. రహస్య సమావేశాలు జరుపుతున్నారు. సీటు కన్ఫాం చేసుకున్న వెంటనే జగన్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో...కూటమిపై నేతలకు నమ్మకం పెరిగింది. వైసీపీలోనే ఉంటే మునిగిపోతామన్న భయానికి తోడు జగన్ ప్రాధాన్యత కల్పించకపోవడంపై నేతలు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే అదును చూసి దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో ఇప్పుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో చేరికలు ఊహించని విధంగా ఉంటాయని, టీడీపీ-జనసేన కూటమి లెక్కలు వేసుకుంటోంది. అధికార వైసీపీ దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబు పని చేస్తున్నారు.