YS Sharmila Comments: ఏలేరు జలాశయం రైతులను నిండా ముంచిందని.. వేల ఎకరాలు నీట మునిగాయని వైఎస్ షర్మిల అన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని ఆరోపించారు. ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదని షర్మిల అన్నారు. మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారని.. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారని అన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయిందని.. 
ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పరిశీలించారు. 


‘‘వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టాడు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటున్నాడు. జగన్ బాబు తప్పిదం అంటున్నారు. బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు? గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పై ఇద్దరికీ పట్టింపు లేదు. జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. తట్టెడు మట్టి కూడా తీయలేదు. 


డ్యాం లు కొట్టుకు పోతున్నా జగన్ కి పట్టింపు లేదు. నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం వచ్చింది. చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్త అన్నాడు. 10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలి. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలి. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడు. జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దు. ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.


రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండి. ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎవరైనా రైతుల మీద పర్యటనకు రావాలి. కష్టాలు చూడాలి. రైతుల పక్షాన నిలబడాలి’’ అని షర్మిల మాట్లాడారు.