Prathipadu TDP Incharge Varapula Raja Dies:
కాకినాడ జిల్లా.... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిసిసిబి మాజీ ఛైర్మన్ వరుపుల రాజా (46) హఠాన్మరణం చెందారు. ఆయన ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వ్యవరిస్తున్నారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే గుండెపోటుతో వరుపుల రాజా మృతి చెందారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో చురుకుగా పాల్గొంటున్న నేత అకాల మరణంపై పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిన వరుపుల రాజా..
ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థి చిరంజీవిరావును గెలిపించాలని వరుపుల రాజా కోరారు. సాలూరి నియోజకవర్గంలోని మక్కువ మండలంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC Elections)లో వరుపుల రాజా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు చిరంజీవిరావుకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కానీ రోజు వ్యవధిలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. 


తెలుగుదేశం ప్రభుత్వ హాయాం లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షునిగా రాజా పనిచేశారు. వరుపుల రాజా అసలు పేరు జోగిరాజు కాగా అందరూ ఆయన్ను రాజా అని పిలుస్తుంటారు. 2004 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజా గతంలో ఆఫ్కాబ్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా పనిచేశారు. వరుపుల రాజా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ తో ప్రారంభమైంది.  2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరుపుల రాజా 1977లో జన్మించారు. రాజా 1997లో ఆంధ్రా యూనివర్శిటీలో బి.కామ్ విద్యను పూర్తి చేశారు.


వరుపుల రాజా మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం..
టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీ కి తీరని లోటని అన్నారు. వరుపుల రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


తెల్లవారు జామున జడ్పీటీసీ మాజీ సభ్యుడు మృతి
టీడీపీ నేత, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మహలక్ష్మీ మిల్క్‌ ప్రొడెక్ట్‌ అధినేత బొల్లా మాల్యాద్రిచౌదరి (62) శనివారం మృతి చెందారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుండెపోటు రావడంతో మాల్యాద్రి చౌదరి కన్నుమూశారు. ఆయనకు భార్య మహాలక్ష్మమ్మ, కుమారుడు నరసింహారావు ఉన్నారు. ఈయన సైతం పువ్వాడి కన్వెన్షన్‌ హాలులో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రతో కలిసి మాల్యాద్రి చౌదరి ఎమ్మెల్సీ ఎన్నికలకుగానూ ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసిన ఆయన బుర్రా గెలుపునకు కృషి చేయడం తెలిసిందే.