గడపగడపకు ప్రభుత్వం పేరుతో వెళ్తున్న నేతలను చాలా ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. 


కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పర్యటించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిసేందుకు వెళ్లారు చిట్టిబాబు. ఓ మహిళ ఎమ్మెల్యేను వంతెన కోసం నిలదీశారు. 


తమ ప్రాంతానికి వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా అందరినీ వేడుకుంటున్నా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారా మహిళ. తమ గ్రామం వచ్చినప్పుడు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయారని ఎమ్మెల్యేని నిలదీశారా మహిళ..


ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యలో హల్చల్ చేస్తోంది.


ఈ మధ్యకాలంలో ఇలానే ప్రజల్లోకి వెళ్లిన మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అంబటి రాంబాబు సీఎం జగన్ ( CM jagan ) ప్రకటించిన విధంగా .. తన నియోజకవర్గం సత్తెనపల్లిలో ఇంటింటికి వెళ్లడం ప్రారంభించారు. ఉదయమే ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ పథకాలు పొందిన ఓ లబ్దిదారుని ఇంటికి వెళ్లారు. ఇంట్లోని మహిళను బయటకు పిలిచారు. ప్రభుత్వ పథకాలు ఏమి వస్తున్నాయో ఆరా తీశారు. ఆమె చెప్పలేకపోయింది కానీ పాంప్లెట్ చూసి అంబటి రాంబాబే పథకాల పేర్లు చెప్పడం ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ ఆసరా ( YSR Asara ) అనే పథకం దగ్గర ఆయనకే డౌట్ వచ్చింది. ఏమిటీ ఈ పథకం అని తెలుసుకోవాలనుకున్నారు. పక్కనే ఉన్న అధికారిని ఆసరా అంటే ఏమిటి అని అడిగారు. తర్వాత మహిళతో ప్రభుత్వం నుంచి రూ. నలభై వేల దాకా వచ్చాయని చెప్పి ముందుకెళ్లారు. 


"ఆసరా" ఏమిటి అని అంబటి రాంబాబు ( Minister Ambati ) పక్కనున్న అధికారిని అడగడం వైరల్ అయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా పతకాలను అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఈ పథకాలపై అధికారులు సహా నేతలు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరూ అవగాహన పెంచుకోవాలని పదే పదే చెబుతూంటారు. అయితే సాక్షాత్తూ మంత్రికే ఆసరా పథకం గురించి అవగాహన లేదని నెటిజన్లు ట్రోల్ చేశారు. 


అంబటి రాంబాబు వీడియోను షేర్ చేస్తూ రకరకాలుగా సోషల్ మీడియాలో విమర్శలు చేశారు నెటిజన్లు.