పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో లో కలిపిన చంద్రబాబును రాజమండ్రి జైల్లో నిర్బంధించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (TDP leader Devineni Uma) అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ అన్నారు. చంద్రబాబు (Chandrababu) జాతి సంపద సంపద సృష్టించే నేత అని, కానీ నదుల అనుసంధానంపై సీఎం వైఎస్ జగన్ ఒక్కరోజైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. దేవినేని ఉమ శుక్రవారం పట్టిసీమ ప్రాజెక్టు (Pattiseema Project)ను సందర్శించి, గోదావరి తల్లికి పూజలు చేశారు. 


పట్టిసీమ పరిశీలించిన అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ.. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఒక్కరైనా వచ్చి ఈ పట్టిసీమ నేలను చూశారా ? అని ప్రశ్నించారు. పట్టిసీమ దండగ పంపులు పీకుతా అన్న నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. పట్టిసీమ కట్టినోడు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారన్నారు. ఇటువంటి చేతకాని ముఖ్యమంత్రి, అసమర్థులైన మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా ? అని మండిపడ్డారు. 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా లో మూడు లక్షలు పంట వేయలేదు, వేసిన పంటను ఈ 46 టీఎంసీలు కాపాడాయన్నారు.  


విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద జరుగుతుందని, వైసీపీ సర్కార్ ఐదు కోట్లు ఖర్చు పెడుతుంది దీని గురించి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదన్నారు. 90 దేశాల నుంచి ప్రతినిధులు, విద్యార్థులు, ఇంజనీర్లు ఉన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షేకావత్ ఉన్నా.. ఒక్క మాట కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదన్నారు. పక్క రాష్ట్రంలో కాలేశ్వరం ప్రారంభోత్సవానికి డ్రామాలాడి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి వచ్చారుని పేర్కొన్నారు. 


1600 కోట్లు ఖర్చుపెట్టిన పట్టిసీమ 50 వేలకోట్ల సంపాదన సృష్టించింది. ఇక్కడ 24 పంపులు ఉంటే నీళ్ల అవసరం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 18 పంపులు ఆడిస్తున్నారంటే ఇంత చేతగాని పనికిమాలిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఎవరైనా ఉంటారా ? అంటూ దేవినేని ఉమ మండిపడ్డారు. ఇదే చంద్రబాబు ఈ కష్టకాలంలో సీఎంగా ఉంటే  24 పంపులు ఆడించి నుంచి 100 టీఎంసీలు గోదావరి నీళ్లు తీసుకెళ్లేవారని చెప్పారు. 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే సీఎం జగన్ 110 మండలాలే అని చెప్పడం దారుణమన్నారు. బుల్లెట్ దింపుతాను అని ఒకరు అడ్రస్ లేకుండా పోయారని, ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి పోలవరం నన్ను అడగవద్దు అంటూ చేతులెత్తేశారు !  ఎప్పుడు అవుతుందో చెప్పలేను అన్నాడని గుర్తుచేశారు.  


నిర్వాసితులను గాలికి వదిలేసిన సీఎం
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, సీఎం జగన్ చర్యలతో రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. పట్టిసీమ గురించి, ప్రాజెక్టుల గురించి, నిర్వాసితుల గురించి ప్రశ్నిస్తున్నామని మా మీద కేసులా ? మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, సీఎం జగన్ అనుచరులు చంద్రబాబు మీద మాపైన 307, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు కట్టిన అమరావతి అసెంబ్లీలో, సచివాలయంలో జగన్ ఉంటున్నారని ప్రజలుకు తెలుసునన్నారు. చంద్రబాబు నిన్న ఆసుపత్రి వద్దకు వెళితే అక్కడ ఇద్దరు డిఎస్పీ లను పెడతామని ప్రభుత్వం కోర్టుకెళ్తే మొట్టికాయలు వేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో తమ్ముడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టాడని విమర్శించారు.