రైల్వేశాఖల్లో మార్పులు చాలా వేగంగాసాగుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు నష్టాల నివారణకు ప్రయత్నాలు చేస్తోంది రైల్వేశాఖ. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో రైల్వేస్టేషన్లు మూసివేతకు నిర్ణయం తీసుకుంది. 


ఎక్స్‌ప్రెస్‌లు ఆగి స్టేషన్‌లు మినగా మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పుుడు మూసివేస్తున్న రైల్వే స్టేషన్‌లలో రోజుకు 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు కూడా రావడం లేదట. అందుకే అక్కడ ఇకపై సేవలు నిలిపివేయనున్నారు. ఇప్పటికే అక్కడి సిబ్బందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. 


రెండు మూడు నెలల్లో విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేయనున్నారు. ఈ మూసివేత ప్రభావం ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలపై పడనుంది. ఈ జిల్లాల్లో ఉన్న కొన్ని స్టేషన్‌లలో కనీసం రోజుకు ఒకటి రెండు టికెట్‌లు కూడా అమ్ముడు పోవడం లేదని రైల్వేశాఖ చెబుతోంది. అందుకే మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.  


మూసివేస్తున్న స్టేషన్లు ఇవే 
అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ, అగ్రహారం, పెదఅవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవెంకటేశ్వరపాలెం,తాలమంచి, తేలుప్రోలు, వట్లూరు, కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు. వీటిలో ఇప్పటికే చాలా స్టేషన్లు మూసివేశారు. ఇప్పుడు మరికొన్నింటిని క్రమంగా క్లోజ్ చేయబోతున్నారు. 


కరోనా తర్వాత భారీ మార్పులు 


కరోనా తర్వాత రైల్వేశాఖ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కొవిడ్ దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇందులో రైల్వేశాఖ కూడా ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న రైల్వే శాఖ కరోనా తర్వాత కూడా రెగ్యులర్ సర్వీస్‌లను నడపడంలో అచితూచి స్పందించింది. చాలా వరకు సర్వీస్‌లను ఇప్పటికీ సస్పెండ్ చేసింది. చాలా పాసింజర్లు నేటికీ పట్టాలెక్కలేదు. ఎక్కే అవకాశం కూడా లేదు. 


ఇంతలో వందేభారత్ పేరుతో మిగతా సర్వీసుల్లో కూడా పెను మార్పులు తీసుకొస్తోంది రైల్వేశాఖ. ఎక్స్‌ప్రెస్‌లలో చేసిన మార్పులు కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనరల్‌ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలను భారీగా తగ్గించేసింది రైల్వే శాఖ. దానికి బదులు ఏసీ బోగీలను పెంచింది. దీని వల్ల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి దూర ప్రయాణాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్సలు వస్తున్నా పట్టించుకున్న వారులేరు. ఇప్పుడు కాస్ట్ కటింగ్‌లో భాగంగా 25 మందికంటే తక్కువ టికెట్లు అమ్ముడయ్యే రైల్వేస్టేషన్‌లు మూసివేస్తున్నారు.