Rajahmundry MP Bharat Comments: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నిప్పులు చెరిగారు. మంగళవారం (జనవరి 30) నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసీ కళాశాలకు అనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చినా నేను ఒక్కడినే చర్చకు వస్తా.. చంద్రబాబుకు ఆ దమ్మూ ధైర్యం ఉందా అని సూటిగా ఎంపీ భరత్ ప్రశ్నించారు. ‌నలభై సంవత్సరాల రాజకీయ అనుభం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే, రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్నైనా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్టు, కనీసం నాలుగో వంతైనా చేశావా అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. పుష్కరాలకు రూ.2 వేల కోట్లు శాంక్షన్ చేశావని చెప్పుకోవడం తప్పిస్తే.. ఆ నిధులతో రాజమండ్రిలో ఏమి చేశావో చెప్పగలవా.. చూపగలవా అని ప్రశ్నించారు. 


పందికొక్కుల్లా బొక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. ‘‘నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్ళలో కేవలం రూ.400 కోట్లతో రాజమండ్రి రూపు రేఖలు మార్చా. ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగిందనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై లోక్‌సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే. నీకేమైనా దమ్మూ ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి. నవ్చు కాకపోతే నీ కొడుకు పప్పు సుద్ద లోకేష్ నైనా ఇక్కడికి పంపి నన్ను ఓడించు’’ అని భరత్ సవాల్ విసిరారు. 


నాపై వేసిన అభాండాలు నిరూపించగలవా?!


ఆవ భూములలో రూ.150 కోట్లు కొట్టేశానని, వర్కులో 15 శాతం తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్క దాంట్లో అయినా నిరూపించగలవా అని చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించినా రాజకీయాలు వదిలేస్తా అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకుని సంపాదించాలనే యావ నీకులా నాకు లేదన్నారు. 


ఏకేసీ పార్కు.. ఎన్టీఆర్ పార్కు ఎలా అవుతుంది


రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులోగల పార్కును మహా నాయకుడు ఏకేసీ పేరు పెడితే..దానిని ఎన్టీఆర్ పార్కుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం..ఈ పార్కుకు గతంలో ఏదైతే పేరు ఉందో, 'ఏకేసీ పార్కు'గా అలానే ఉండాలని. ఈ విషయమై కలెక్టర్, కమిషనర్ కు పంపిస్తానని అన్నారు. 


సొమ్మొకడిది.. సోకొకడిది..


రాజమండ్రి నగరంలో టీడీపీ చోటా మోటా నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుని ఆనందిస్తున్నారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్ ట్రాక్ ను సుమారు రూ.30 లక్షలతో కామాక్షి ఇండస్ట్రీస్ మురళి, ఆర్ఎంసీ నిర్మిస్తే..అక్కడ ఫ్లెక్సీలు టీడీపీ వాళ్ళు పెట్టుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. అలాగే టెన్నిస్ కోర్టుకు గతంలో శాప్ రూ.25 లక్షలు శాంక్షన్ చేసిందట. కానీ పనులు గాలికొదిలేశారు. కాంట్రాక్టరే వదిలేశాడు. నేను ఎంపీ అయిన తరువాత పోలీసు డిపార్ట్మెంట్ సహకారంతో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేశానని చెప్పారు. అక్కడ టీడీపీ ఫ్లెక్సీలు. మచ్చుకు చేసిందేమీ లేదు కానీ..ఫ్లెక్సీలకు కొదవలేదన్నారు. ఒకే కుటుంబంలో మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేసినా చెప్పుకునేందుకు ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. నేను చేసింది ఏమిటో ఈ నగర ప్రజలు చెబుతారని అన్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని  వడ్డీ వ్యాపారాలు, చిట్ల వ్యాపారాలతో ప్రజలను బెదిరించే వారికి ఎందుకు ఓట్లు వేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.