కంటికి ఇంపుగా కనపడితే ఇక ఆ బైక్‌ గాయాబ్‌.. తాళం వేసి ఉన్నా అవేమీ మనోడి చేతివాటం ముందు పని చేయవు. ఎంతటి లాక్‌నైనా అవలీలగా తీసేసి దర్జాగా బండి నడుపుకుంటూ జారుకునే నేర్పరి. గడచిన ఆరునెలల వ్యవధిలో ఏకంగా రూ.11 లక్షల విలువైన మోటారు సైకిళ్లు కొట్టేసి అమ్మేసుకున్న ఘనుడు.


కేవలం జల్సాలకు అలవాటు పడి మోటారు సైకిళ్లే దొంగిలించి అమ్మేయడం ప్రవృత్తిగా చేసుకున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 27కు పైగా బైక్‌ దొంగతనాలకు పాల్పడి వాటిని విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికు చెందిన కేశవరపు సుబ్రహ్మణ్యం(సుబ్బు) స్థానికంగా ఓ కాఫీ హోటల్‌లో పనిచేస్తుంటాడు. ప్రవృత్తిగా కంటికి కనిపించిన మోటారు సైకిల్‌ను కొట్టేయడం, ఆ తరువాత వాటిని అమ్మేయడం చేస్తుంటాడు. అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు మోటారు సైకిళ్లు దొంగతనం చేశాడు. పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4, నగరంలో 1, రాజోలులో 4, పాలకొల్లులో 1 ఇలా 14 మోటారు సైకిళ్లు దొంగతనానికి పాల్పడ్డాడు. మరో 13 మోటారు సైకిళ్లు గుర్తించవలసి ఉందన్నారు. ఈ బైక్‌లు విలువ రూ.11లక్షలు వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు.


కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతూ..
కంటికి కనిపించిన బైక్‌లను చాకచక్యంగా కొట్టేసి కొన్ని బైక్‌లను యధాతధంగా అమ్మేసి, మరికొన్ని బైక్‌లను విడిభాగాలుగా విడగొట్టి అమ్మేస్తాడు. అమ్మితే వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు ఘరానా దొంగ కేశవరపు సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు. ఇతన్ని పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, స్థానిక ఎస్సై ఏ.చైతన్యకుమార్‌ నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడు మాచవరం గ్యాస్‌ గొడౌన్‌ వద్ద తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేశారు. 


ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్‌..
నాలుగేళ్లుగా ఓ మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానని, నమ్మించి అత్యాచారం చేశాడన్న ఫిర్యాదుపై రాజోలు మండలం ములికిపల్లికి చెందిన ముసునూరి వరప్రసాద్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. నిందితుడు ప్రసాద్‌ పి.గన్నవరంలోని తన బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడని, అప్పటినుంచి ఇప్పటివరకు బాలికకు మాయమాటలు చెబుతూ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేశాడని చెప్పారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై ఫోక్సో, అత్యాచారాల చట్టంకింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. నిందితున్ని అరెస్ట్‌చేసి అమలాపురం కోర్టులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.