కలియుగ ప్రతక్షదైవంగా కొలిచే తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిలో నిత్యాన్నదానంతో వేల మంది భక్తులు ఆకలి తీరుస్తున్నారు. రుచిశుచికరమైన అన్నప్రసాదాలతో భక్తులకు సేవలందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో వెలసిన బాలబాలాజీ సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ముందే నిత్యాన్నదానం ప్రవేశపెట్టి భక్తుల ఆకలి తీర్చింది. అప్పనపల్లి బాలబాలాజీ పుణ్యక్షేత్రంలో 1977 నుంచి అన్నదానం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుసుకొని ఆశ్చర్యపోయారు.  తిరుపతి నుంచి ఓ అధ్యయన బృందాన్ని అప్పనపల్లి పంపించి మరీ వివరాలు తెలుసుకున్నారట..


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో శ్రీబాలబాలాజీ దేవస్థానాన్ని 1967లో నిర్మించారు. వశిష్టానదీపాయ నుంచి విడిపోయి ఉత్తరవాహిణిగా ప్రవహించే వైనతేయనదీ తీరంలో ఉండే అర్పణఫలి నేటి అప్పనపల్లి. ఇక్కడ ఉన్న బాలబాలాజీ టెంపుల్‌ చాలా ప్రతీతి. ఈ గ్రామంలో జన్మించిన మొల్లేటి రామస్వామి కొబ్బరి వ్యాపారం చేసి వచ్చే లాభాలను తిరుపతి వేంకటేశ్వర స్వామికి సమర్పించేవారట. స్వామి పాదాల చెంతన ఆ ధనాన్ని పెడతానని కోరిన రామస్వామి కోరికను అర్చకులు అంగీకరించలేదట. 


తిరుమల అర్చకులతో వాదనకు దిగి ఇంటికి వచ్చేసిన రామస్వామి కలలో శ్రీనివాసుడే బాల్యరూపంలో దర్శనమిచ్చాడని చెప్తారు. తానే అప్పనపల్లి వస్తానని చెప్పార. ఇలా జరిగిన కొన్ని రోజులకు రామస్వామికి తన కొబ్బరితోటల్లో బాలబాలాజీ ప్రతిమ దర్శనమిచ్చందని చెబుతున్నారు. 


బాలబాలాజీ ప్రతిమ లభించిన చోటే నిత్యపూజలు చేయడం ప్రారంభించారు. అలా అప్పనపల్లి బాలబాలాజీగా నిత్యపూజలందుకుంటున్నాడు. ఈక్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల పెరిగింది. వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని ఆకలితో వెళ్లకూడదని ఆలయ వ్యవస్థాపకులు మొల్లేటి రామస్వామి సొంత ఖర్చుతోనే నిత్యన్నదానం ప్రారంభించారని చెబుతారు.


అప్పనపల్లి శనివారం, ఆదివారం ప్రత్యేకంగా భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం దేవాదాయధర్మాదాయ శాఖ ద్వారా భక్తులకు నిత్యాన్నదానం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ పద్దతిలో అరిటాకులో బూరె, పులిహోరా, అన్నం, పప్పు, రెండు మూడు కూరలతో ప్రత్యేకంగా వడ్డిస్తారు. దర్శించుకున్న భక్తులకు బూరెలు, పులిహోరా, లడ్డూలు ప్రసాదంగా అందజేస్తున్నారు.


1977లో ప్రారంభమైన నిత్యాన్నదానం వరదల సమయంలో మినహా మరెప్పుడూ ఆగలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగతూనే ఉంటుంది. శుచి, రుచితోపాటు పూర్తిగా స్టీమ్‌ పద్దతిలో వంటశాలలను ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రతీ ఆదివారం స్వామిని దర్శించుకుని వశిష్ట నదీలో దంపతులు స్నానమాచరిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చే భక్తులు తులాభారం, తలనీలాలు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.