క్లాస్ రూంలో పిల్లలు ఒకరిని మరొకరు కత్తులతో దాడి చేసుకోవడం కలకలం రేపింది. వారు తొమ్మిదో తరగతి చదువుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో దారుణమైన ఘటన జరిగింది. రాజానగరం ప్రభుత్వ హైస్కూల్లో ఓ విద్యార్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. పరీక్ష జరుగుతుండగానే ఎక్సామ్ హాల్‌లో టీచర్ల ఎదుటే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజానగరం ప్రభుత్వ హైస్కూల్‌లో పెంకే శ్రీహరి సాయి, ఉదయ్ శంకర్ అనే ఇద్దరు బాలురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పరీక్షా హాలులో పరీక్ష రాస్తుండగా శ్రీహరి సాయిపై ఉదయ్ శంకర్ అనే విద్యార్థి కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి బాధిత విద్యార్థిని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ అఘాయిత్యానికి ప్రేమ వ్యహహారమే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.