జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ టైమ్‌లో చిన్నపాటి గ్యాప్ ఇచ్చి వారాహి విజయ యాత్ర రెండో దశ ప్రారంభించిన పవన్..ఈసారి నేరుగా వైసీపీని, ఆ పార్టీ బలాలను టార్గెట్ చేశారు. ఏలూరులో జరిగిన వారాహి విజయ యాత్రలో సీఎం జగన్‌పై కౌంటర్లు విసరటమే కాదు ఏపీలో వైసీపీ ప్రధాన బలంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ మీద సంచలన వ్యాఖ్యలే చేశారు.


ముందుగా సీఎం జగన్‌ను ఇన్నాళ్లు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారూ అంటూ వచ్చిన పవన్..ఇకపై ఆ గౌరవం ఇవ్వబోనని కామెంట్స్ చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవికే జగన్ అనర్హుడని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రజలకు, మీడియాకు భయపడి సింగిల్ ప్రెస్‌మీట్ కూడా పెట్టకుండా పరదాల మాటున దాక్కుని తిరిగే జగన్‌ను ఇకపై ఏకవచనంతోనే సంబోధిస్తానని అన్నారు. ఆదివారం జరిగిన సభలో మొత్తం జగన్...జగన్ అంటూనే కోట్ చేశారు తప్ప ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ అనలేదు. ఇది డైరెక్ట్‌గా వైసీపీ క్యాడర్‌ను టార్గెట్ చేస్తుందని తెలిసినా..అటాకింగ్ గేమ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నట్లున్నారు పవన్.






అక్కడితో ఆగలేదు పవన్. ఏ సెంటిమెంట్‌తో అయితే జగన్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని మొదలు పెట్టారో అదే సెంటిమెంట్ పైనా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. తన తండ్రి సాధారణ కానిస్టేబుల్ అని నిజాయతీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి అని చెబుతూనే మీ తండ్రిలా జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 6 పర్సెంట్ కమీషన్లు తీసుకోలేదని...ముఖ్యమంత్రి కాదని..అందుకే తన పార్టీ నిర్వహణ కోసం కార్యకర్తల కోసం సినిమాలు చేసుకుంటానని పవన్ వైఎస్సాఆర్ పైనే కామెంట్స్ చేశారు.






అన్నింటికంటే పెద్ద కామెంట్స్ ఏపీ వాలంటీర్ల వ్యవస్థ మీద చేశారు పవన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడవటానికి క్షేత్రస్థాయిలో కీలకమైన వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర నేరారోపణలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 30వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని...అందులో 18వేల మంది ఆచూకీ అసలు తెలియటం లేదని అన్నారు. అయితే అన్ని వేల మంది అమ్మాయిలు మిస్సవ్వటానికి అసలు రీజన్ ఏపీ వాలంటీర్లు అంటూ బాంబు పేల్చారు పవన్. ఇంటింటికీ తిరిగి ప్రతీ పథకం కోసం సర్వేలు చేసి ఆరాలు తీసే వాలంటీర్లు.. ఒంటరి మహిళలు, యువతులకు సంబంధించిన సమాచారాన్ని సంఘవిద్రోహశక్తులకు అందిస్తున్నారని..ఈ విషయాన్ని తనకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పాయని సంచలన వ్యాఖ్యలే చేశారు పవన్. హ్యూమన్ ట్రాఫికింగ్‌సు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 


ఇప్పుడు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు పర్యవసానం ఏంటీ..పవన్ కామెంట్స్ పై ఇటు వైఎస్సాఆర్ సీపీ, అటు వాలంటీర్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి. పవన్ మాత్రం వారాహియాత్ర 2 తో పొలిటికల్ అటాకింగ్ గేమ్ అయితే మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.