JAC Demand for Polavaram District: పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం పోలవరం జిల్లాలను ప్రకటించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో ఏ టికెట్ సెంటర్ వద్ద ఏటిగట్టు సెంటర్ వద్ద మంగళవారం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు ముంపు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.


పశ్చిమ ఏజెన్సీ గిరిజన మండలాలైన జిలుగుమిల్లి, బుట్టయిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, వి ఆర్ పురం, ఏటిపాక, చింతూరు కూనవరం తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, రంపచోడవరం, సీతానగరం బూర్గంపాడు మండలాలకు రాకపోకలకు అనువుగా ఉంటుందన్నారు. రంపచోడవరం ఏజెన్సీ నుంచి 250 కి.మీ దూరంలో జిల్లా కేంద్రం పాడేరు ఉండటంతో ఇక్కడి గిరిజన గిరిజన ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు.


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం తమ డిమాండ్ కు మద్దతు తెలిపారని జేఏసీ వెల్లడించింది. పోలవరంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కారం దొరకాలంటే జిల్లా ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి కనుక పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. ముందుగా ఏటి గట్టు సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించగా, కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు చేపట్టారు.