Andhra Pradesh News: సముద్రతీరంలో డీ పట్టా భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు సాగు ఒక ఎత్తైతే.. దానికి చట్టవ్యతిరేకంగా విద్యుత్తు వినియోగం మరో నేరం. ఇంకా వండర్ ఏంటంటే అందులో మరో బరితెగింపు పనికి పూనుకున్నారు అక్రమార్కులు. సీఆర్‌జడ్‌ పరిధిలో చేయకూడని ఆక్వాసాగుకు అక్రమంగా విద్యుత్తు కనెక్షన్లు పొంది ఆపై ఆ విద్యుత్తును యూనిట్లు చొప్పున పక్క చెరువుల సాగుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. 


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోన‌సీమ జిల్లా అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం, ఓడలరేవు తీరంగా జరుగుతోన్న ఈ దందా అందర్నీ ఆశ్చర్యపరుతోంది. ఇదంతా తెలిసినా విద్యుత్తు శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 
అక్రమ విక్రయాలు ఇలా....


కొమరగిరిపట్నం, ఓడలరేవు సముద్రతీరానికి సమీపంలో ఆక్వాసాగుకు సంబందించి దాదాపు 90 శాతం చెరువుల వద్ద ఏరియేటర్లు, మోటార్లు తదితర అవసరాలకు విద్యుత్తునే వినియోగిస్తున్న పరిస్థితి. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఆక్వా చెరువులకు అనుమతులు ఎలా వచ్చాయన్నదే మొదటి అనుమానం. అందులో ప్రతీ చెరువుకు విద్యుత్తు వినియోగంలో ఉండడం మరో వింత. 


వేరే జిరాయతీ భూమికి తాలూకు సర్వే నెంబర్‌, యజమాని పేరున ఆక్వా అనుమతులు తీసుకుంటున్నారు. అదే పేరుతో విద్యుత్తు సర్వీసు కూడా తీసుకుంటున్నారు. ఆపై తీరంలో ఉన్న చెరువుల వద్ద అదే కనెక్షన్‌ పెడుతున్నారు. దీనికి తోడు అదనపు కేబుల్స్‌ ద్వారా విద్యుత్తు సరఫరాను ఇతరుల చెరువులకు మళ్లిస్తున్నారు. ఇలా విద్యుత్తును అనధికారికంగా మళ్లించి విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.4 నుంచి రూ.5 వరకు అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ దందా కొమరగిరిపట్నం, ఓడలరేవు తీరప్రాంతం కేంద్రంగా మూడు ఏరియేటర్లు... ఆరు యూనిట్లు చందంగా సాగుతోంది.  


హెచ్‌పీల లెక్కన విక్రయాల జోరు...
ఆక్వాసాగుకు సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై ఇస్తుంది. అదే రాయితీ లేని కనెక్షన్‌ అయితే యూనిట్‌కు రూ.7 చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి. దీన్ని తప్పించుకోవడానికి ఒక్క కనెక్టెడ్‌ లోడు నుంచి రోజుకు ఒక్కో కనెక్షన్‌కు 40 నుంచి 50 హెచ్‌పీల స్థాయి వరకు విద్యుత్తును అక్రమంగా అమ్ముకుంటున్నారు. 


ఉదాహరణకు ఒక ఒకరం చెరువుకు 10 హెచ్‌పీల చొప్పున రోజుకు 20 గంటల వినియోగం ఉంటుంది. దీనిని బట్టి ఒక ఎకరం చెరువుకు రోజుకు 200 యూనిట్లు నుంచి 250 వరకు ఖర్చు అవుతుంది. విద్యుత్తు వినయోగానికి ఎటువంటి పరిమితి లేకపోవడంతో ఒక హెచ్‌పీ వినియోగానికి రూ.250 చొప్పున వసూళ్లు చేస్తూ రోజుకు 40 నుంచి 60 హెచ్‌పీల స్థాయి వరకు విద్యుత్తును అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇలా కనెక్టడ్‌ లోడ్‌ను మించి ప్రతీ కనెక్షన్‌దారు అడిషనల్‌ లోడ్‌కు బిల్లు చెల్లించి మరీ విద్యుత్తును అమ్ముకోవడం ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.


అధికారులేం చేస్తున్నారు..?
సముద్రతీరంలో ఆక్వాచెరువుల వద్ద విద్యుత్తు కనెక్షన్లు పూర్తిగా అక్రమమని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాటికి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయడం, కనెక్షన్లు ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే ఈ అక్రమంలోనే మరో అక్రమానికి తెరతీసి విక్రయాలు చేస్తున్నా పట్టించుకున్న వారే లేరు. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అక్రమదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.  ేఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టిసారించి ఈ అక్రమ దందాకు అడ్డుకట్టవేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.