Godavaari Floods | వర్షాలు కురవడంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాలనుంచి వెళ్లువలా వచ్చిచేరుతోన్న వరద ప్రవాహానికి గోదావరి పోటెత్తుతోంది. దీంతో భధ్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో 49.10 అడుగుల స్థాయికి వరద చేరుకోగా రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీచేశారు.. ఈప్రభావంతో ధవళేశ్వరం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్యారేజ్‌ వద్దకు భారీ స్థాయిలోనే వరద ఒరవడి కొనసాగుతోంది.. దీంతో కాటన్‌ బ్యారేజ్‌ వద్దకు నీటిమట్టం 12.10 అడుగులకు చేరగా దిగువకు సముద్రంలోకి 10,28,649 క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు జలవనరుల శాఖ అధికారులు.. ధవళేశ్వరం వద్దకు వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఒకటో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు.. దీంతో తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై లంక గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు..


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హై అలెర్ట్‌..


ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్దకు భారీస్థాయిలో వరద ఉద్ధృతి పెరుగుతుండగా ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు.. దిగువకు 10,28,640 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతుండడంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ప్రవహించే గౌతమి, వశిష్టా, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈక్రమంలోనే జిల్లాలోని డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లను జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్‌లోనూ కంట్రోల్‌ రూమ్‌ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవ్వరైనా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ ` 08856-293104, అమలాపురం ఆర్డీవో కార్యాలయం 8008803201, కొత్తపేట ఆర్డీవో కార్యాలయం 08855-144299, రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం 08857-245166 నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడిరచారు. 


కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువ పొంది వరద ముప్పు..


కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువకు భారీ స్థాయిలో వరద ఉప్పొంగడంతో పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలో వరద ముంపుకు గురయ్యాయి..ఈ వరద ఉద్ధృతికి జగ్గంపేట మండలం కిర్లంపూడిలో పలు గ్రామాలు నీటమునిగాయి.. ఈప్రాంతంలో పంట పొలాలు ముంపుకు గురవ్వడంతో పంటనష్టం వాటిల్లింది..  ఏలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని వదలడంతో ఈప్రభావం పిఠాపురం నియోజకవర్గ పరిధిపై పడి పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.. ఈక్రమంలోనే కాకినాడ`కత్తిపూటి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.


ఇక పెద్దాపురం నియోజకవర్గంలోనూ వరద ఉద్ధృతి వల్ల పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. కాండ్రకోటకు వెళ్లే రోడ్డు మార్గం మొత్తం జలదిగ్భధంలో చిక్కుకుంది. ఇదే నియోజకవర్గంలోని రాగంపేట, వడ్లమూరు ప్రాంతాల్లో ఏలేరు కాలువ ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇదిలా ఉంటే ఇదే జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజులపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడిన ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాలు ముంపుకు గురవ్వగా అధికారులు అప్రమత్తమై గండి పూడ్పించారు.. అయితే ఈప్రభావంతో దాదాపు 3,500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.


ఏలేశ్వరం రిజర్వాయరుకు వర‌ద త‌గ్గుముఖం..


ఏలేరు రిజర్వాయరుకు 45 వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో దిగువకు 27వేల క్యూసెక్కుల వరదనీటిని వదలారు.. అయితే నిన్నటి రాత్రి నుంచి ఇన్‌ఫ్లో తగ్గి మంగళవారం సాయంత్రం నాటికి 24,300 క్యూసెక్కుల స్థాయి తగ్గడంతో దీంతో దిగువకు 2,500 క్యూసెక్కుల వరద తగ్గించి వదులుతన్నట్లు ఎస్‌ఈ(ధవళేశ్వరం) జి.శ్రీనివాసరావు తెలిపారు. రేపటికి ఈ వరద ఉద్ధృతి మరింత తగ్గే పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.