పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటె ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
ప్రెస్ మీట్ లో జక్కంపూడి రాజా విమర్శలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ సిక్స్ (Super Six) అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని నమ్మబలి కారు. భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారు, కానీ 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు.
వైసీపీ పాలనలో పథకాల అమలు భేష్..
జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. అమ్మఒడి,విద్యాదీవెన, విద్యా వసతి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు జమచేశారు. ముఖ్యంగా అమ్మఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి, సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకునేవారని జక్కంపూడి రాజా వివరించారు. ఇది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రం మరో శ్రీలంకగా మారి పోతుందని, బిహార్ గా మారిందని ఇష్టం వచ్చినట్లు జగన్ మీద, వైసీపీ మీద అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రజల్ని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని జక్కంపూడి ప్రశ్నించారు.
డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు..
ప్రజలకు పథకాలు అమలు చేయకపోవడం వలన సామాన్య ప్రజలకు డబ్బుల్లేకుండా పోయాయని,ఫలితంగా ఒకప్పుడు కళకళ లాడిన మార్కెట్లు ఇప్పుడు వెలవెల బోయాయని జక్కంపూడి రాజా వాపోయారు. ఏ ఒక్క షాపులో కూడా గిరాకీ లేకుండా పోయిందన్నారు.పైగా సంక్రాంతి పండగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట,వంటి జూద శిబిరాలు ఏర్పాటుచేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేశారని ఆయన ఆరోపించారు.
ఎంతో మంది ఉసురు పోసుకున్నారు.. పండుగ మూడు రోజులు విచ్చలవిడిగా జూదాలు నడిపించి ఎంతో మంది అమాయకుల ఉసురు పోసుకున్నారని జక్కంపూడి రాజా విమర్శించారు. గుండాటలో డబ్బులు పోగొట్టుకుని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే, కోడిపందేల్లో డబ్బులు ఇవ్వలేదని మరో యువకుడు పీక కోసుకున్నాడని ఆయన సాక్షా ఆధారాలతో ప్రస్తావిస్తూ,ఇదేనా కూటమి పాలన అని నిలదీశారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2వేల బరులు ఏర్పాటుచేస్తే,అందులో 400వరకు బడులనే కేంద్రంగా చేసుకుని జూదాలు నడిపారని ఆయన ధ్వజమెత్తారు. ఇక మద్యo ఏరులై పాటిందని, చరిత్రలో ఎన్నడూలేని విధంగా 400కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి మద్యం అమ్మకాలు సాగినట్లు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే పత్రికలోనే వచ్చిందని జక్కంపూడి రాజా సదరు పత్రిక వార్తను చదివి విన్పించారు.సంపద సృష్టి అంటే ఇదేనాఅని ప్రశ్నించారు. బరుల దగ్గర పోలీసులను పక్కకు గెంటేయడం, తోసెయ్యడం వంటివి చూస్తుంటే,అసలు లా ఆర్డర్ ఉందా అని ఆయన నిలదీశారు.
రాజానగరం ఎమ్మెల్యే దోపిడీ చేశారని ఆరోపణలు
రాజానగరం నియోజక వర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్నిచోట్లా బరులు ఏర్పాటుచేసి, ఒక్కొక్కడు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వేలం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రూ 10 కోట్లు దండుకున్నారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నట్లు తెలుస్తోందని ఆయన వాపోయారు. రాజానగరంలో ఎప్పుడు లేని విధం గా డ్రగ్స్, రేవు పార్టీలు, జూదాలు జరిగాయని అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపవరంలో జనసేన నాయకుడు దగ్గర మూలాలు ఉన్నాయన్నారు.
వి.ఆర్.ఓ పోస్టు మొదలుకుని సి.ఐ పోస్టు వరకు డబ్బులు వసూలు చేయడం వలన అన్ని ఆఫీసుల్లో పనికి ఇంత అనేరీతిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేసారు. గతంలో చేసిన వేతన ఒప్పందం కంటే తక్కువ చేస్తామనడం సమంజసం కాదన్నారు.ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఒక బ్రోకర్ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అతడి కారణంగానే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు.