అమలాపురం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలు వల్ల అనేక వ్యవస్థలు, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని అందుకే ఇకపై జగన్ నెవర్ ఎగైన్ అన్న తన నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకటేశ్వరరావు ప్రకటించారు. తన జీవితంలో కాళ్లు, చేతులు ఆడినంత వరకు సమాజంకోసం పనిచేస్తానని తన రిటైర్మెంట్ పంక్షన్లో చెప్పానని, అదే కొనసాగిస్తానన్నారు. రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తానన్నారు.
జగన్ పారీ విధ్వంసం సృష్టించింది..
గత అయిదేళ్లపాలనలో జగన్ పార్టీ విధ్వంసం సృష్టించిందని మాజీ ఏపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం కోలుకోలేని దెబ్బతిన్నాడని, ఆర్దీక సామాజిక విధ్వంసం కొనసాగిందన్నారు. వైసీపీ వాళ్లకు సంఘంలో ఏమాత్రం గౌరవం లేదన్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రాకూడదని, ప్రజల అయిదేళ్ల ఎంతో పోగొట్టుకున్నారన్నారు. రాజకీయాలు అంటే కేవలం సంపాదన అనుకనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు. జగన్ ఒక మోనాస్టార్ అంటూ అక్రమాలు చేసే వారికి ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. కులాలు, వర్గాలుగా ప్రజలను విడదీశాడని, కేవలం తన స్వార్ధం కోసం బలిపెడతాడని ఇంతటి విపరీత మనస్తత్వం కలిగిన జనగ్ను ఆయన వెంట ఉన్న నేతలు వీడాలని సూచించారు. తను ప్రస్తుతం ఏపార్టీలోనూ లేనని, అలా అని పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదన్నారు.
కోడికత్తి శ్రీనుకు అన్యాయం జరుగుతోంది..
జనుపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను జగన్ వీరాభిమాని అని, అయితే ఆయన కోసం బలి అయిన మొదటి వ్యక్తి కోడికత్తి శ్రీను అని అన్నారు. జగన్ అధికారంలో వచ్చేందుకు సానుభూతికోసమే ఆయనపై దాడికి పాల్పడినట్లు శ్రీను విచారణలో తెలిపాడని, అయితే 5 సంవత్సరాలు జైలులో పెట్టించి అతని జీవితాన్ని నాశనం చేశాడని, ఇప్పటికీ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. కోర్టుకు హాజరు కాకుండా, సాక్షం చెప్పకుండా కేసును నీరుగార్చే యత్నం జగన్ చేస్తున్నాడన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయస్థానంలో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. కోడికత్తి శ్రీనుకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. తన అనుభవంతో నిలబెడతానని, జగన్ బాధితులకు అండగా ఉండడంతోపాటు జగన్ అక్రమాలు, అన్యాయాలు బట్టబయలు చేస్తానన్నారు.
జగన్ ఆస్తులన్నీ అక్రమమే..
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో రూ.25 కోట్లతో మొదలు అయిన సండూర్ పవర్ ప్రాజెక్టు నెడు రూ.759 కోట్లకు చేరిందని, ఆతరువాత సాక్షి ఛానెల్, భారతి సిమెంట్స్ ఇంకా అనేక అక్రమ కంపెనీలకు పెట్టుబడులు ఇప్పటికే బయటపడ్డాయని, మరిన్ని అక్రమాలు బట్టబయలవుతాయన్నారు. అయితే దీంట్లో తన ప్రయత్నాలకు అంతా సహకరించాలన్నారు. కోకొల్లలుగా ఉన్న జగన్ కేసులపై పోరాడతానన్నారు. జగన్ తనకు వ్యక్తిగతంగా నష్టం చేశాడు.. ఆ అకౌంట్ క్లోజ్ అయ్యింది.. జగన్పై పోరాడే విషయంలో వ్యక్తిగతం ఏమీ లేదని, జగన్ సమాజానికి చేసిన కీడుపై మాత్రమే పోరాటం చేస్తానన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.