Chelluboina Venugopal - రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని, కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది పురందేశ్వరి చెప్పాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. కులాల మధ్య విభేదాలు సృష్టించి..అధికారంలోకి రావాలనేది వారి తపన అని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు. మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణం చంద్రబాబు కాదా? ఎన్నికల వేళ చంద్రబాబు మళ్లీ బీసీల భజన చేస్తున్నాడని మండిపడ్డారు. 


ఒక్క శెట్టిబలిజకు కూడా సీటివ్వలేదేం? 
పవన్‌ కళ్యాణ్.. కాపులు, శెట్టిబలిజలను కలిపేస్తానని చెబుతున్నారు.. కానీ ఒక్క శెట్టిబలిజకు కూడా సీటు ఎందుకివ్వలేదు. ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు బీసీ భజన. అధికారంలోకి వస్తే తోకలు కత్తిరిస్తానంటాడు. బీసీలను ఉన్నత స్థానానికి తీసుకొస్తున్నది జగన్‌. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు వారి మనోభావాలను దెబ్బతీశాడు. తన కొడుకు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఇతర పార్టీలను కలుపుకుని చంద్రబాబు వస్తున్నాడు.  నిజం మాట్లాడటం రాని చంద్రబాబుకు నేడు పవన్‌ కల్యాణ్, బీజేపీ కలిసింది. 2014 ముందు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. 2018లో జరగాల్సిన ఎన్నికలు చంద్రబాబు ఎందుకు జరపలేదు? జగన్‌ సీఎం అయిన తర్వాత 34 శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంటే.. ప్రతాప్‌రెడ్డి అనే అనుచరుడిని కోర్టుకు పంపి చంద్రబాబు అడ్డుకున్నారు - మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ


ఐదేళ్లలో పింఛన్లi పెంచకుండా ఏం చేశావు?
గతంలో 75 రూపాయలు పెన్షన్‌ చేయడానికి ఖాళీ అయితే కానీ ఇవ్వలేను అని చంద్రబాబు అన్నాడు. జన్మభూమి కమిటీల సమావేశాలకు పెన్షన్‌ దారులను తీసుకొచ్చి రాజకీయాలు చేశారు. రూ.3 వేల పింఛన్ జగన్ ఇచ్చారు. బీసీలకు పింఛన్ అని చంద్రబాబు అంటున్నారు. రాజ్యసభ స్థానాల్లో ఎప్పుడైనా నీ పార్టీ బీసీలకు సీటిచ్చిందా? 9 స్థానాలు వస్తే వాటిలో 4 స్థానాలు బీసీలకు వైసీపీ కేటాయించింది. 


నీ సోషల్‌ ఇంజినీరింగ్‌ ఎక్కడ పవన్‌ కల్యాణ్‌?:
సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తానంటూ పవన్‌ కల్యాణ్‌ ఫెయిల్‌ కావడానికి కూడా చంద్రబాబే కారణం. కాపులు, శెట్టిబలిజలను కలిపేస్తానన్న పవన్ కల్యాణ్‌ కనీసం శెట్టిబలిజకు ఒక సీటు కూడా కేటాయించలేదు. కులాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనేది మాత్రమే నీ తపన. 1994–2004 వరకూ చంద్రబాబు ఏ బీసీ విద్యార్థికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారా? వైఎస్సార్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే సగానికి తగ్గించిన వ్యక్తి చంద్రబాబు. బీసీలకు నేడు ఇంగ్లీషు మీడియం విద్య ఇస్తానంటే కేసులు వేయించి అడ్డుకున్నారు. జగన్‌ మత్స్యకారులు, చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నారు. ఏదో ఒక ప్రలోభపెడితే బీసీలు నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నాడు. జగన్‌ మా జిల్లాలో 6 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. రాజ్యసభకు బోస్‌గారిని పంపాడు. 2 మండలి స్థానాలు ఇచ్చారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు.  - మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ


కులగణనపై కపట నాటకాలు
కులగణన ప్రక్రియ పూర్తి చేసి కేంద్రానికి పంపించాం. ఎన్నికల కమిషన్‌కు కూడా పంపించాం. ఎన్నికల ముందు కులగణన చేయడం ఏంటి అని చంద్రబాబు, పవన్ అన్నారు. 50 శాతానికి మించి ఉన్న బీసీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు జగన్. బీసీలందరూ జగన్‌, వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారు. కులగణనను బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం పంపిన వినతులను పరిష్కరించని బీజేపీ కులగణనకు అనుకూలమని ఎలా చెబుతున్నారని మంత్రి చెల్లుబోయిన ప్రశ్నించారు.