కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కారు. మహిళల పక్కనే కూర్చొని వారితో కాసేపు మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు ప్రయాణం చేశారు. ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. ఇందులో భాగంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నులపై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. 


మహిళలు స్పందిస్తూ.. కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని, తీవ్రమైన భారంగా మారాయని చెప్పారు. టీడీపీ గతంలో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై వీరు హర్షం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధి గురించి చంద్రబాబు నాయుడు మహిళలకు వివరించారు.


మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




ఇసుక గుట్టల వద్ద సెల్ఫీ ఛాలెంజ్


కొత్తపేట నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆలమూరు మండలం జొన్నాడలో జగన్ ప్రభుత్వం ఇసుక గుట్టలను నిల్వ చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆ ఇసుక గుట్టల వద్దకు వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇసుక గుట్టలు చూస్తే ఏస్థాయిలో వైసీపీ అక్రమాలు చేస్తుందో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇష్టా రాజ్యంగా గోదావరిని తవ్వి ఇసుకను తరలించేస్తున్నారని చంద్రబాబు అన్నారు. బండారు సత్యానందరావు, గంటి హరీష్ బాలయోగి తదితరులు ఈ సెల్ఫీ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.