Boat Race for Fish Hunting in Mummidivaram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో మత్స్యకారులు చేపల వేట హద్దు కోసం గోదావరి పాయలో బోట్లతో పోటీ పడ్డారు. మామూలుగా అయితే సినిమాల్లో బైక్ రేసింగ్, బోటు రేసింగ్, కుస్తీ పోటీలు, ఎద్దుల బండి పందేలు చూసి ఉంటాయి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం రియల్ లైఫ్ ఇలా ఉంటుంది. మత్స్యాకారులు చేపల వేటనే జీవనాధారంగా నమ్ముకుని ఉంటారు. ఈ క్రమంలో చేపల వేట హద్దుల కోసం బోట్ల పోటీ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాట్రేనికోన ఎస్సై టి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 


ఒక్కసారి దూసుకెళ్లిన 100 వరకు బోట్లు 
శనివారం ఉదయం 7గంటలకు ముహూర్తంగా నిర్ణయించి తారాజువ్వ వేయడంతో ఒక్కసారిగా బోట్ల పోటీ మొదలైంది. పల్లంకుర్రు, ఎదుర్లంక, దరియాలతిప్ప, యానాం నుంచి కోటిపల్లి వరకు ఉన్న ప్రాంతాలలో అధిక సంఖ్యలో చేపలు పడే ప్రాంతం కోసం బోట్లతో పోటీ పడి దక్కించుకుంటారు. ఈ పోటీలో సుమారు 100 బోట్లతో పోటీ పడ్డారు. ముందుగా ఎవరైతే వెళ్లి ఆ ప్రాంతానికి చేరుకుంటారో వారికి గోదావరికి వరదలు వచ్చే వరకు ఆ ప్రాంతం వారి అధీనంలో ఉంటుంది. ఈ విధంగా పోటీ పడి తమ హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.


అద్దె బోట్లలో చేపల వేట స్థలాన్ని దక్కించుకొనేందుకు పోటీ 
గతంలో పోటీ కోసం లక్షలు చెల్లించి అద్దెకు స్పీడ్ బోట్లను తెచ్చి పోటీకి సిద్ధమయ్యేవారు. అధిక మొత్తంలో అద్దె చెల్లించి స్పీడ్ బోట్లు తెచ్చు కోలేని నిరుపేదలు చేపలు అధికంగా దొరికే హద్దును కోల్పోయేవారు. దీంతో అందరూ ఒకే రకం బోట్లు వాడాలని పెద్దలు నిర్ణయించారు. సొంత బోట్లులేని వారు స్థానికంగా దొరికే అద్దె బోట్లలో చేపల వేట స్థలాన్ని దక్కించుకొనేందుకు పోటీలో పాల్గొన్నారు. బలుసుతిప్పకి చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గోదావరికి వరదలతో సొంత ఊరు చేరతారు. 





దీపావళి అనంతరం చేపల వేట హద్దుల కోసం పెట్టే బోట్ల పోటీలో పాల్గొంటారు. ఇది తంతు ప్రతీ ఏటా కొనసాగుతుంది. ఈ పోటీలో చేపల వేట హద్దులు దక్కించుకొని సుమారు మూడు వేల మంది లంగరు వలకట్లతో చేపల వేట చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో మల్లాడి ఆదినారాయణ, మల్లాడి ఏడుకొండలు, ఇసుకపట్ల శ్రీనుబాబు, తిరుమాని సత్తిబాబు, ఓలేటి సతీష్, కామాడి గంగాద్రి, తిరుమాని వీరబాబు, సంగాని చిన్ని, పెమ్మాడి రాముడు, సంగాని సముద్రుడు, బర్రె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పులస చేపలు గత కొన్ని రోజుల నుంచి మత్స్యకారుల గేలానికి చిక్కడం లేదు. దొరికితే మాత్రం వారి పంట పండినట్లే. పులస చేపలు రికార్డు ధర పలుకుతాయి.